ఏపీలో కొత్త జిల్లాల‌కు లీడ్ బ్యాంకులను ప్ర‌క‌టించిన ఆర్బీఐ

rbi announces lead banks for new districts in andhra pradesh
  • 10 జిల్లాల‌కు లీడ్ బ్యాంకుగా యూబీఐ
  • అన్న‌మ‌య్య, పార్వ‌తీపురం మ‌న్యం జిల్లాల‌కు ఎస్‌బీఐ
  • స‌త్య‌సాయి జిల్లాకు లీడ్ బ్యాంకుగా కెన‌రా బ్యాంకు
  • పాత జిల్లాల లీడ్ బ్యాంకుల‌ను మార్చ‌ని ఆర్బీఐ
ఏపీలో కొత్త‌గా ఏర్పాటైన జిల్లాల‌కు లీడ్ బ్యాంకుల‌ను కేటాయిస్తూ భార‌తీయ రిజ‌ర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) గురువారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో 13 జిల్లాలు ఉండ‌గా... కొత్త‌గా 13 జిల్లాల ఏర్పాటుతో మొత్తం జిల్లాల సంఖ్య 26కు చేరిన సంగ‌తి తెలిసిందే. పాత జిల్లాల‌ను ఆయా జిల్లా కేంద్రాల‌తోనే కొన‌సాగిస్తూ... వాటి పేర్ల‌ను కూడా మార్చ‌ని ఏపీ ప్ర‌భుత్వం... కొత్త జిల్లాల‌కు మాత్ర‌మే కొత్త జిల్లా కేంద్రాల‌ను ప్ర‌క‌టించింది.

ఈ క్ర‌మంలో పాత జిల్లాల‌కు అప్ప‌టిదాకా లీడ్ బ్యాంకులుగా వ్య‌వ‌హ‌రిస్తున్న బ్యాంకులే ఇక‌పైనా ఆయా జిల్లాల లీడ్ బ్యాంకులుగా కొన‌సాగుతాయ‌ని ఆర్బీఐ తెలిపింది. కొత్తగా ఏర్పాటైన జిల్లాల‌కు మాత్రం నూత‌నంగా లీడ్ బ్యాంకుల‌ను కేటాయిస్తూ గురువారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. 

కొత్త‌గా ఏర్పాటైన బాప‌ట్ల‌, ఏలూరు, కాకినాడ‌, కోన‌సీమ‌, నంద్యాల‌, అల్లూరి, అన‌కాప‌ల్లి, ఎన్టీఆర్‌, ప‌ల్నాడు, తిరుప‌తి జిల్లాల‌కు యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) లీడ్ బ్యాంకుగా వ్య‌వ‌హ‌రించ‌నుంది. అదే స‌మ‌యంలో అన్న‌మ‌య్య‌, పార్వ‌తీపురం మ‌న్యం జిల్లాల‌కు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) లీడ్ బ్యాంకుగా ఉంటుంది. ఇక స‌త్య‌సాయి జిల్లాకు కెన‌రా బ్యాంకును లీడ్ బ్యాంకుగా ప్ర‌క‌టిస్తూ ఆర్బీఐ ఉత్త‌ర్వులు జారీ చేసింది.
Go Back to Shorts
Andhra Pradesh
New Districts
Lead Bank
Union Bank Of India
UBI
State Bank Of India
SBI
Canara Bank
RBI

More Telugu News