ED: స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివో సగం ఆదాయాన్ని చైనాకు చేరవేసింది: ఈడీ వెల్లడి

  • వివోపై మనీలాండరింగ్ కేసు
  • రెండ్రోజుల కిందట 44 ప్రాంతాల్లో సోదాలు
  • తాజాగా 119 బ్యాంక్ అకౌంట్ల స్తంభన
  • పన్నుల ఎగవేతకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు
ED blocks VIVO bank accounts

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివోపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. తాజాగా వివో సంస్థకు చెందిన 119 బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసింది. ఈ ఖాతాలకు అనుబంధంగా రూ.465 కోట్ల ఫిక్స్ డ్ డిపాజిట్లు ఉండగా, ఈ ఖాతాల్లో రూ.73 లక్షల నగదు, 2 కిలోల బంగారు కడ్డీలు గుర్తించారు. 

కాగా, వివో తన ఆదాయంలో 50 శాతాన్ని (రూ.62,476 కోట్లు) చైనాలోని తన మాతృసంస్థకు చేరవేసిందని ఈడీ వెల్లడించింది. భారత్ లో భారీగా పన్నులు ఎగవేయడానికే ఈ విధంగా ఆదాయ తరలింపు చేపట్టిందని ఆరోపించింది. భారత్ లో తమకు విపరీతమైన నష్టాలు వచ్చాయని, అందుకే పన్నులు చెల్లించలేకపోతున్నామని చూపడానికే ఈ తరలింపులు జరిగాయని ఈడీ వివరించింది. 

కాగా, వివో, దాని అనుబంధ సంస్థలపై ఈడీ రెండ్రోజుల కిందట సోదాలు నిర్వహించింది. దేశంలోని 44 ప్రాంతాల్లో మనీలాండరింగ్ చట్టం కింద ఈ సోదాలు జరిపింది. 

ఇటీవల, తమ గుర్తింపు పత్రాలను కొందరు చైనా వాటాదారులు ఫోర్జరీ చేశారంటూ జమ్మూ కశ్మీర్ కు చెందిన ఓ డిస్ట్రిబ్యూటర్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఆరోపణల ఆధారంగా ఈడీ కూడా మనీలాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు షురూ చేసింది. ఇటీవల కొంతకాలంగా చైనా వ్యాపార సంస్థలపై భారత కేంద్ర ప్రభుత్వం నిశితంగా దృష్టి సారించింది.

More Telugu News