Amarnath: రెండేళ్ల విరామం తర్వాత అమర్​ నాథ్​ యాత్ర.. దర్శించుకునేందుకు బయలుదేరిన 4,890 మంది

  • పహల్ గామ్, బల్తాల్ బేస్ క్యాంపులకు బయలుదేరిన భక్తులు
  • గురువారం అమర్ నాథ్ వైపుగా ప్రయాణం మొదలు
  • ఈసారి 43 రోజుల పాటు కొనసాగనున్న యాత్ర
  • కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేసిన కేంద్ర ప్రభుత్వం
Amarnath Yatra starts after a gap of two years First batch with 4890 devoties

హిందువులకు అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక యాత్రల్లో ఒకటైన అమర్ నాథ్ యాత్ర ప్రారంభమైంది. బుధవారం జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జమ్మూ నగరంలోని భగవతి నగర్ బేస్ క్యాంపు వద్ద ప్రత్యేక పూజలు చేసి ఈ యాత్రను ప్రారంభించారు. 4,890 మంది యాత్రికులతో కూడిన తొలి బ్యాచ్ పహల్ గామ్, బల్తాల్ బేస్ క్యాంపులకు బయలుదేరింది. యాత్రికులంతా భం భం భోలే, ఓం నమ: శివాయ అంటూ 176 వాహనాలలో బయలుదేరారు. గురువారం ఆ బేస్ క్యాంపుల నుంచి అమర్ నాథ్ వైపు ప్రయాణం మొదలుపెడతారు.

43 రోజుల పాటు యాత్ర
 

  • ఈ సారి అమర్ నాథ్ యాత్ర మొత్తంగా 43 రోజుల పాటు కొనసాగనుంది. అంటే గురువారం (జూన్ 30) నుంచి మొదలై ఆగస్టు 11న రక్షా బంధన్ రోజున ముగుస్తుంది.
  • పహల్ గామ్ బేస్ క్యాంపు నుంచి వెళ్లేవారు దక్షిణ కశ్మీర్ లోని నున్వాన్ దారి మీదుగా 48 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది.
  • బల్తాల్ బేస్ క్యాంపు నుంచి వెళ్లేవారు సెంట్రల్ కశ్మీర్ లోని గండర్బల్ మీదుగా 14 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది.
  • ఉగ్రవాద ముప్పు నేపథ్యంలో అమర్ నాథ్ యాత్ర కోసం అత్యంత పకడ్బందీగా భద్రత ఏర్పాటు చేశారు. ఐదు వేల మందికిపైగా భద్రతా సిబ్బందిని మోహరించినట్టు అధికారులు తెలిపారు.

కరోనాతో రెండేళ్ల విరామం తర్వాత..
చివరి సారిగా అమర్ నాథ్ యాత్ర 2019 జూలై 1 నుంచి ఆగస్టు 1 వరకు జరిగింది. మొత్తం 3.42 లక్షల మంది మంచు శివలింగాన్ని దర్శించుకున్నారు. తర్వాత కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్లు ఈ యాత్రను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో ఈసారి యాత్ర కోసం డిమాండ్ ఏర్పడింది. మొత్తంగా మూడు లక్షల మందికిపైగా అమర్ నాథ్ యాత్ర కోసం రిజిస్టర్ చేసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు. 

More Telugu News