చంద్రుడిని రాకెట్ ఢీకొడితే ఏమయిందో తెలుసా?.. నాసా ఏం చెప్పిందో చూడండి
- ఇటీవల నిర్వహించిన ప్రయోగాల్లోని ఓ రాకెట్ భాగం చంద్రుడిపై కూలిన తీరు
- గంటకు 9 వేల కిలోమీటర్లకుపైగా వేగంతో ఢీకొట్టడంతో రెండు భారీ గుంతలు పడినట్టు గుర్తింపు
- ఆ రాకెట్ చైనాదా, నాసాదా అన్నదానిపై చర్చలు
ఎవరిదా రాకెట్?
ఓ రాకెట్ భాగం చంద్రుడివైపు దూసుకెళ్తున్నట్టు నాసా శాస్త్రవేత్తలు ఈ ఏడాది జనవరిలోనే గుర్తించారు. కొంతకాలం దాన్ని ట్రాక్ చేశారు. అది మార్చి 4వ తేదీన చంద్రుడిపై గుర్తు తెలియని ప్రదేశంలో ఢీకొట్టింది. ఆ రాకెట్ భాగం దాదాపు ఏడాది కింద ఉప గ్రహ ప్రయోగానికి వాడినదని అంచనా వేశారు. అయితే అది చైనా ప్రయోగించిన రాకెటా, అమెరికా ప్రయోగించిన రాకెటా అనేది తేలలేదు.
రెండు భారీ గుంతలతో..
రాకెట్ భాగం చంద్రుడిని ఢీకొట్టినప్పుడు పైకి ఎగిరి పడి ఉంటుందని.. దీనితో ఒకదానికొకటి ఆనుకుని రెండు గుంతలు పడ్డాయని నాసా పేర్కొంది. 18 మీటర్ల వెడల్పుతో ఒక గుంత, 16 మీటర్ల వెడల్పుతో మరో గుంత ఏర్పడినట్టు తెలిపింది. మనుషులు ప్రయోగించిన రాకెట్లు ఇలా భూమి నుంచి దూరంగా వెళ్లి చంద్రుడిని ఢీకొట్టడం ఇదే మొదటిసారి అని నాసా తెలిపింది.
- అయితే ఇంతకు ముందు 1970వ దశాబ్దంలో చంద్రుడిపైకి నాసా ప్రయోగించిన అపోలో వ్యోమనౌకల్లో నాలుగు ల్యాండింగ్ సమయంలో ఫెయిలై చంద్రుడిని ఢీకొన్నాయని వెల్లడించింది.
- అవి చంద్రుడిపైకి ప్రయోగాల కోసం పంపినవని.. కానీ తాజా రాకెట్ భాగం భూమి చుట్టూ తిరిగే శాటిలైట్ ప్రయోగానికి సంబంధించినదని తెలిపింది.