చవకబారు వ్యాఖ్యలు మానుకోవాలంటూ జీవీఎల్ వార్నింగ్... తనకెలాంటి దురుద్దేశం లేదన్న రామ్ గోపాల్ వర్మ

  • ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము
  • మరి పాండవులు, కౌరవులు ఎవరన్న వర్మ
  • వర్మపై బీజేపీ నేతల ఆగ్రహం
  • లక్ష్మణరేఖ దాటొద్దన్న జీవీఎల్
  • వివరణ ఇచ్చిన వర్మ
రాష్ట్రపతి పదవికి ఎన్డీయే అభ్యర్థిగా గిరిజన వర్గానికి చెందిన ద్రౌపది ముర్మును బీజేపీ అధినాయకత్వం ఎంపిక చేయడం తెలిసిందే. అయితే, వివాదాస్పద వ్యాఖ్యలకు మారుపేరుగా నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ అంశంపైనా తనదైన శైలిలో స్పందించారు. ద్రౌపది రాష్ట్రపతి అవుతుంటే... మరి పాండవులు ఎవరు? ముఖ్యంగా కౌరవులు ఎవరు? అంటూ వర్మ ట్వీట్ చేశారు. దీనిపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. 

ఈ క్రమంలో, వర్మ వ్యాఖ్యలపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పందించారు. రాష్ట్రపతి అభ్యర్థిపై వర్మ చవకబారు వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయం అని, లక్ష్మణరేఖ దాటొద్దని స్పష్టం చేశారు. 

మరోపక్క, తన వ్యాఖ్యల పట్ల వివాదం చెలరేగడంతో వర్మ ట్విట్టర్ లో స్పందించారు. తాను ఎలాంటి దురుద్దేశంతోనూ ఆ వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చారు. భారతంలో తనకు నచ్చిన పాత్ర ద్రౌపది అని, ఆ పేరు చాలా అరుదుగా ఉంటుందని అన్నారు. అందుకే, ఆ పేరు తెరపైకి రాగానే, ఆ పేరుతో ముడిపడిన అనేక అంశాలు జ్ఞప్తికి వచ్చాయని వర్మ వివరించారు. ఆ కోణంలోనే తన అభిప్రాయాలను వెల్లడించానని, అంతేతప్ప ఎవరి మనోభావాలను గాయపరచాలన్నది తన ఉద్దేశం కాదని స్పష్టం చేశారు.


More Telugu News

GVL Narasimha Rao Ram Gopal Varma Droupadi Murmu BJP India