ఐపీఎల్ లో ఆడడం మాకు పెద్ద ఆశయం అంటున్న ఐర్లాండ్ కెప్టెన్

ఐపీఎల్ లో ఆడడం తమకు పెద్ద ఆశయమని ఐర్లాండ్ కెప్టెన్ ఆండ్య్రూ బాల్ బిర్నీ తెలిపాడు. భారత్-ఐర్లాండ్ జట్లు ఈ నెల 26 నుంచి రెండు టీ20 మ్యాచుల్లో తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో బిర్నీ మీడియాతో తన అభిప్రాయాలను పంచుకున్నాడు. భారత్ జట్టులో ఎంతో అనుభవం కలిగిన ఆటగాళ్లు ఉన్నందున.. ఈ సిరీస్ తమకు ఓ మంచి అవకాశంగా పేర్కొన్నాడు. 

‘‘ఇంగ్లండ్ తో టెస్ట్ కోసం ఓ జట్టు వెళ్లింది. ఐర్లాండ్ కు మరో జట్టు వచ్చింది. టీ20 జట్టులోని భారత ఆటగాళ్లు పూర్తి స్థాయి ప్రధాన జట్టులో చోటు కోసం చూస్తుంటారు. కనుక వారిపైనా ఒత్తిడి ఉంటుంది. త్వరలో న్యూజిలాండ్ తో ఆడనున్నాం. తదుపరి టీ20 ప్రపంచకప్ జరగనుంది. కనుక ఇరువైపులా ఆటగాళ్లకు తాము ఏంటో నిరూపించుకునే అవకాశం ఇది’’ అని తెలిపాడు.

ఐపీఎల్ గురించి మాట్లాడుతూ.. "ఐపీఎల్ లో చోటు కోసం ఎంత పోటీపడాలో మాకు అవగాహన ఉంది. మాకు అది పెద్ద ఆశయం కూడా. టీ20 క్రికెట్ లో అదే అత్యున్నత శిఖరం. లీగ్ లో చోటు దక్కిన తర్వాత ఆటగాళ్లు ఎంత వేగంగా వృద్ధిలోకి వస్తున్నారో (ఆటతీరు మెరుగుపడడం) చూస్తున్నాం’’ అని బిర్నీ వివరించాడు.


More Telugu News