Maharashtra: శివ‌సేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంద‌రు?

  • షిండే శిబిరంలో మొత్తం 42 మంది ఎమ్మెల్యేలు
  • వారిలో 35 మంది శివ‌సేన ఎమ్మెల్యేలు
  • మిగిలిన ఏడుగురు ఇండిపెండెంట్లు
  • గ‌వ‌ర్న‌ర్ ముందు బ‌ల ప్ర‌ద‌ర్శ‌న‌కు సిద్ధ‌మ‌న్న షిండే
42 mlas are in shivsena rebel leader eknath shinde camp

మ‌హారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి కార‌ణ‌మైన శివ‌సేన తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే త‌న వెంట న‌డిచిన ఎమ్మెల్యేల‌తో కలిసి ప్రస్తుతం గువాహటిలో బ‌స చేసిన సంగ‌తి తెలిసిందే. మరోపక్క, షిండే ప‌క్షాన నిలిచిన ఎమ్మెల్యేల సంఖ్య అంత‌కంత‌కూ పెరుగుతోంది. ప్ర‌స్తుతం ఆయన శిబిరంలో మొత్తం 42 మంది ఎమ్మెల్యేలున్నారు. వీరిలో 35 మంది శివ‌సేన‌కు చెందిన వారు కాగా... ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు. ఈ మేర‌కు త‌న శిబిరం బ‌లాన్ని ప్ర‌ద‌ర్శించిన షిండే గురువారం మ‌ధ్యాహ్నం ఓ వీడియో విడుద‌ల చేశారు.

ఈ సంద‌ర్భంగా ఏక్‌నాథ్ షిండే కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మూడింట రెండొంతుల కంటే అధికంగా ఎమ్మెల్యేల‌ను క‌లిగిన త‌మ శిబిర‌మే అస‌లైన శివ‌సేన అని ఆయ‌న పేర్కొన్నారు. గ‌వ‌ర్న‌ర్ ముందు బ‌ల ప్ర‌ద‌ర్శ‌న‌కు కూడా తాము సిద్ధంగానే ఉన్నామ‌ని ఆయ‌న తెలిపారు. నిన్న‌టిదాకా 38 మంది ఎమ్మెల్యేలే త‌న‌ వెంట ఉన్నార‌న్న షిండే... గురువారం ఉద‌యం మ‌రో న‌లుగురు ఎమ్మెల్యేలు త‌న శిబిరంలో చేరిన‌ట్లు వెల్ల‌డించారు.

More Telugu News