Rassie van der Dussen: క్యాచ్ మిస్ చేసి.. భారత్ మూల్యం చెల్లించుకుంది: డుసెన్

  • 29 పరుగుల వద్ద డుసెన్ క్యాచ్ జారవిడిచిన అయ్యర్
  • ఆ తర్వాత చెలరేగి ఆడిన దక్షిణాఫ్రికా బ్యాటర్
  • 16 బంతుల్లో 46 పరుగులు
  • మ్యాచ్ ఫలితాన్ని మార్చేసిన వైనం
Had to make India pay after Shreyas Iyer dropped my catch says Rassie van der Dussen

తొలి టీ20 మ్యాచ్ లో భారత్ పై దక్షిణాఫ్రికా ఏ మాత్రం ఒత్తిడి లేకుండా సునాయాసంగా గెలిచేసింది. దక్షిణాఫ్రికా విజయంలో ప్రధానంగా మిల్లర్, రస్సీ వాండర్ డుసెన్  గురించి చెప్పుకోవాలి. వీరిద్దరూ క్రీజులో కుదురుకుని మరో వికెట్ పడకుండా.. వచ్చిన ప్రతీ బాల్ ను చీల్చి చెండాడారు. డుసెన్ 46 బంతుల్లో 75 పరుగులు పిండుకుంటే, డేవిడ్ మిల్లర్ 31 బంతుల్లో 64 పరుగులు రాబట్టుకున్నాడు.

నిజానికి డుసెన్ ముందే అవుట్ అవ్వాల్సింది. కానీ, అతడు ఇచ్చిన క్యాచ్ ను శ్రేయాస్ అయ్యర్ పట్టుకోలేకపోయాడు. చేతి నుంచి జారి పడిపోయింది. దీనికి భారత్ జట్టు భారీ మూల్యమే చెల్లించుకుంది. భారత్ మూల్యం చెల్లించుకున్నట్టు స్వయంగా డుసెన్ కూడా వ్యాఖ్యానించాడు.

డుసెన్ మొదటి 30 బంతులకు చేసిన పరుగులు కేవలం 29. ఇక ఆ తర్వాత మొదలైంది బ్యాటుతో ఊచకోత. తదుపరి 16 బంతుల్లో అతడు 46 పరుగులు (నాలుగు సిక్సర్లు, ఐదు బౌండరీలు) చేశాడంటే ఏ పాటి విధ్వంసమో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి మ్యాచ్ ను దక్షిణాఫ్రికా వైపు తిప్పాడు. డుసెన్ 29 స్కోరుతో ఉన్న సమయంలో 16వ ఓవర్లో అతడు కొట్టిన షాట్ ను శ్రేయాస్ అయ్యర్ జారవిడిచాడు. 

‘‘క్యాచ్ ను జారవిడవడం కీలకం. కుదురుకోవడానికి కొన్ని బాల్స్ ను వాడుకున్నాను. ఒక్కసారి కుదురుకుంటే వికెట్ చాలా తేలిక. కాకపోతే కుదురుకోవడమే కష్టం. వారు మూల్యం చెల్లించుకునేలా చేస్తానని నాకు తెలుసు’’ అని డుసెన్ మ్యాచ్ అనంతరం తన అంతరంగాన్ని తెలిపాడు. 

‘‘నేను క్రీజులో ముందుగా బౌండరీలు కొట్టకుండా నా జట్టును ఒత్తిడికి లోను చేశాను. కొన్ని సందర్భాల్లో మన అనుసరణ ఫలితమివ్వదు. కొన్ని సందర్భాల్లో ఇస్తుంది. ఒకవేళ శ్రేయాస్ అయ్యర్ నా క్యాచ్ ను పట్టి ఉంటే ఆట మరోలా ఉండేది’’ అని డుసెన్ చెప్పడం గమనార్హం.

More Telugu News