జులై 18న రాష్ట్రప‌తి ఎన్నిక‌ల పోలింగ్... జులై 21న ఓట్ల లెక్కింపు

  • ఈ నెల 15న రాష్ట్రప‌తి ఎన్నిక‌లకు నోటిఫికేష‌న్‌
  • ఈ నెల 29 వ‌ర‌కు నామినేష‌న్ల స్వీక‌ర‌ణ‌
  • జులై 2 వ‌ర‌కు నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు గ‌డువు
  • రాష్ట్రప‌తి ఎన్నికల షెడ్యూల్‌ను విడుద‌ల చేసిన సీఈసీ రాజీవ్ కుమార్‌
భార‌త రాష్ట్రప‌తి ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌లైంది. ఢిల్లీలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ రాజీవ్ కుమార్ ఈ షెడ్యూల్‌ను విడుద‌ల చేశారు. రాష్ట్రప‌తి ఎన్నిక‌లకు నోటిఫికేష‌న్‌ను ఈ నెల 15న జారీ చేయ‌నున్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు. జూన్ 15 నుంచి నామినేష‌న్ల స్వీక‌ర‌ణ ప్రారంభ‌మ‌వుతుంద‌ని ఆయ‌న చెప్పారు. ఈ నెల 29 వ‌ర‌కు నామినేష‌న్ల‌ను స్వీక‌రిస్తామ‌ని, 30న నామినేష‌న్ల ప‌రిశీలన ఉంటుంద‌ని రాజీవ్ కుమార్ ప్ర‌కటించారు. జులై 2 వ‌ర‌కు నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు గ‌డువు ఉంటుంద‌ని ఆయ‌న తెలిపారు. 

రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో కీల‌కమైన పోలింగ్‌ను జులై 18న నిర్వ‌హించ‌నున్న‌ట్లు రాజీవ్ కుమార్ ప్ర‌క‌టించారు. ఆ త‌ర్వాత జులై 21న ఓట్ల లెక్కింపును నిర్వ‌హిస్తామ‌ని ఆయ‌న తెలిపారు. ప్ర‌స్తుత రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్ పద‌వీ కాలం జులై 24తో ముగియ‌నుంద‌ని, ఈ నేపథ్యంలో జులై 25లోగా నూత‌న రాష్ట్రప‌తి ఎన్నిక పూర్తి కావాల్సి ఉంద‌ని తెలిపిన రాజీవ్ కుమార్‌.. అందుక‌నుగుణంగానే షెడ్యూల్‌ను ఖ‌రారు చేశామ‌ని తెలిపారు. నామినేషన్ల ప‌ర్వం, ఓట్ల లెక్కింపు ఢిల్లీలోనే జ‌ర‌గ‌నుండ‌గా...పోలింగ్ మాత్రం పార్ల‌మెంటు, ఆయా రాష్ట్రాల అసెంబ్లీల ఆవ‌ర‌ణ‌లో జ‌ర‌గ‌నున్న‌ట్లు రాజీవ్ కుమార్ ప్ర‌క‌టించారు.


President Of India
Election Commission of India
Presidential Elections 2022
Chief Election Commissioner of India
Rajiv kumar

More Telugu News