Aadhaar: ఇంటివద్దే ఆధార్ లో మార్పులు... పోస్ట్ మేన్ లకు శిక్షణ

  • ఆధార్ లో మార్పుల అంశం కష్టతరంగా మారిన వైనం
  • యూఐడీఏఐ కీలక నిర్ణయం
  • 48 వేల మంది పోస్ట్ మేన్ లకు శిక్షణ
  • డెస్క్ టాప్ లు, ల్యాప్ టాప్ ల సాయంతో సేవలు
UIDAI has been training postmen to easier Aadhaar modifications

భారత్ లో ఆధార్ కార్డు ప్రాముఖ్యత అంతాఇంతా కాదు. ప్రభుత్వ, ప్రైవేటు, బ్యాంకింగ్ లావాదేవీలకు ఇది ఎంతో ముఖ్యమైనది. అయితే, ఆధార్ లో తప్పులు సరిచేయించుకునేందుకు ప్రజలు ఆయా కేంద్రాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరగాల్సి వస్తుందన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అయితే, ఆధార్ లో మార్పులకు సంబంధించిన సేవలను ఇంటివద్దనే అందించేలా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) చర్యలు తీసుకుంటోంది. 

ఈ మేరకు దేశవ్యాప్తంగా 48 వేల మంది పోస్ట్ మేన్ లకు శిక్షణ ఇస్తోంది. వారికి ఆధార్ కిట్ తో కూడిన డెస్క్ టాప్, ల్యాప్ టాప్ లను అందిస్తోంది. ఆధార్ తో మొబైల్ ఫోన్ నెంబరు అనుసంధానం చేయడం, ఇతర వివరాలు అప్ డేట్ చేయడం, బాలల వివరాలను ఆధార్ లో నమోదు చేయడం వంటి విధులను వీరికి కేటాయించనున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా పోస్ట్ మేన్ లకు 13 వేల మంది బ్యాంకింగ్ ప్రతినిధులు కూడా సహకరిస్తారు. పోస్ట్ మేన్ లు సేకరించిన వివరాలను వీరు అప్ డేట్ చేస్తారు. 

దేశంలో మారుమూల ప్రాంతాల్లోనూ ఆధార్ సేవలు అందించడమే తమ లక్ష్యమని యూఐడీఏఐ పేర్కొంది. ప్రస్తుతం ట్యాబ్, మొబైల్ ఫోన్ ద్వారా పోస్ట్ మేన్ లు పైలెట్ ప్రాజెక్టు కింద చిన్నపిల్లల వివరాల నమోదు చేపడుతున్నారని వివరించింది.

More Telugu News