Vadodara: ఇదో వింత... తనను తానే వివాహం చేసుకోబోతున్న గుజరాత్ యువతి!

  • తనను తానే ప్రేమిస్తున్నానని ప్రకటన
  • అందుకే స్వీయ వివాహం చేసుకుంటున్నట్టు వివరణ
  • వధువుగా మారాలన్న తన కోరిక తీరుతోందన్న యువతి
  • పెళ్లి తర్వాత హనీమూన్ కు సైతం వెళుతుందట
Vadodara woman set to marry herself

ఇక్కడ మనం వినబోయే పెళ్లి వేడుక చాలా ప్రత్యేకమైనది. ఎప్పుడూ విని ఉండం. గుజరాత్ లోని వడోదరకు చెందిన 24 ఏళ్ల క్షమాబిందు పెళ్లి చేసుకుంటోంది. ఇందులో ప్రత్యేకత ఏముంది అంటారా..? ఉందండి. ఆమె తనకు నచ్చినవాడినో, లేదా పెద్దలు కుదర్చిన వ్యక్తినో పెళ్లి చేసుకుని వైవాహిక బంధాన్ని ప్రారంభించడం లేదు. తనను తానే పెళ్లాడుతోంది. విచిత్రంగా అనిపించినా ఇది ముమ్మాటికి నిజం. ముహూర్తం జూన్ 11. 

ప్రకృతి విరుద్ధమైన పెళ్లి అయినా ఆమె సంప్రదాయబద్దంగానే చేసుకోవాలని నిర్ణయించుకుంది. గుజరాత్ లో ఇదే తొలి స్వీయ వివాహం (సోలోగమీ) కానుంది. ‘‘నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోవాలి అనుకోవడం లేదు. అయినా కానీ, వధువుగా మారాలని అనుకుంటున్నాను. అందుకే స్వీయ వివాహం. నేను దీనికి సంబంధించి ఆన్ లైన్ లో కూడా శోధించాను. దేశంలో ఏ మహిళ అయినా తనను తానే పెళ్లి చేసుకుందా? అని పరిశీలించాను. కానీ, ఎవరూ లేరని తెలిసింది. కనుక దేశంలో తనను తాను ప్రేమించి పెళ్లి చేసుకునే మొదటి వ్యక్తిని నేను ’’ అని క్షమాబిందు ప్రకటించింది.

‘‘స్వీయ వివాహం అంటే నీ పట్ల నువ్వు అంకిత భావం కలిగి ఉండడం. ఎటువంటి షరతుల్లేని ప్రేమకు నిదర్శనం. తనను తాను స్వీకరించడం ఇది. ప్రజలు తాము ప్రేమించిన వారిని పెళ్లి చేసుకుంటారు. నన్ను నేనే ప్రేమించాను’’ అందుకే ఈ పెళ్లి అని బిందు వింత వాదన వినిపించింది. తన తల్లిదండ్రులు స్వేచ్ఛావాదులంటూ, తన పెళ్లికి దీవెనలు అందించినట్టు చెప్పింది. 

గోత్రిలోని ఆలయంలో వివాహం చేసుకున్న తర్వాత హనీమూన్ కోసం గోవా వెళ్లాలన్నది క్షమాబిందు ప్రణాళికల్లో భాగం. అప్పుడప్పుడు ఇలాంటి అరుదైన విషయాలు వినాల్సి వస్తుంది తప్పదు. 

More Telugu News