అబుదాబి వెళ్లేందుకు నటి జాక్వెలిన్‌కు షరతులతో కూడిన అనుమతి

  • రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో సుకేష్ చంద్రశేఖర్‌తో జాక్వెలిన్‌కు సంబంధాలు
  • విదేశాలకు వెళ్లకుండా లుక్ అవుట్ నోటీసులు
  • ఈ నెల 31 నుంచి జూన్ 6 వరకు ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్
  • రూ. 50 లక్షల పూచీకత్తు సమర్పించి వెళ్లొచ్చంటూ కోర్టు అనుమతి
అబుదాబిలో ఈ నెల 31 నుంచి జూన్ 6వ తేదీ వరకు జరగనున్న ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్‌ (IIFA)లో పాల్గొనేందుకు బాలీవుడ్ ప్రముఖ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు కోర్టు షరతులతో కూడిన అనుమతినిచ్చింది. రాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లను రూ. 200 కోట్లకు మోసం చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుకేష్ చంద్రశేఖర్‌‌తో జాక్వెలిన్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు ఈడీ విచారణలో తేలిన నేపథ్యంలో ఆమెకు చెందిన రూ. 7.27 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అటాచ్ చేసింది. ఈ కేసు విచారణలో ఉన్న నేపథ్యంలో ఆమె ఇండియా విడిచి వెళ్లకుండా కోర్టు నిషేధం విధించింది. 

అయితే, అబుదాబిలో జరగనున్న ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్‌లో పాల్గొనాల్సి ఉందని, కాబట్టి వెళ్లేందుకు తనను అనుమతించాలని కోరుతూ జాక్వెలిన్ కోర్టును ఆశ్రయించింది. అబుదాబిలో తాను ఏ హోటల్లో బస చేయబోతున్నదీ సంబంధిత వివరాలను సమర్పించింది. పరిశీలించిన న్యాయస్థానం ఆమెపై ఉన్న లుక్ అవుట్ సర్క్యులర్ (LOC)ని కొట్టివేస్తూ అబుదాబి వెళ్లేందుకు అనుమతినిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే, రూ. 50 లక్షల డిపాజిట్‌ను పూచీకత్తుగా సమర్పించాలని షరతు విధించింది. తిరిగి భారత్ చేరుకున్నాక ఆ విషయాన్ని దర్యాప్తు సంస్థకు తెలియజేయాలని సూచించింది.

Jacqueline Fernandez
Bollywood
IIFA
Abu Dhabi
Sukesh Chandrashekhar
ED

More Telugu News