Tirupati: నాయుడుపేటలో టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేసి, నిప్పంటించిన దుండగులు

  • నాయుడుపేటలోని కార్యాలయంపై అర్ధరాత్రి దాడి
  • సమాచారం అందుకున్న వెంటనే కార్యాలయానికి చేరుకున్న పనబాక లక్ష్మి
  • అధికార గర్వంతో వైసీపీ నేతలే ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని ఆరోపణ  
Unidentified men set fire to Nayudupeta TDP Office

తిరుపతి జిల్లా నాయుడుపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడిచేసిన దుండగులు దానిని ధ్వంసం చేసి ఆపై నిప్పు అంటించారు. పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో ఉన్న కార్యాలయం వద్దకు ఆదివారం రాత్రి బైక్‌పై వచ్చిన ముగ్గురు యువకులు అక్కడే ఉన్న టీడీపీ నాయకుడు గంగబాబును అకారణంగా దుర్భాషలాడారు. 

ఆ తర్వాత కాసేపటికి గంగబాబు అక్కడి నుంచి వెళ్లిపోగా నిందితులు కార్యాలయ ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి కార్యాలయ తలుపులపై పెట్రోలు పోసి నిప్పంటించారు. అది గమనించిన ఓ వ్యక్తి గంగబాబుకు ఫోన్ చేయడంతో ఆయన వెంటనే పోలీసులకు సమాచారం అందించి కార్యాలయం వద్దకు చేరుకున్నారు. స్థానికుల సాయంతో మంటలను అదుపు చేశారు.  

మరోవైపు, కార్యాలయంపై దాడి సమాచారం అందుకున్న నెల్లూరు జిల్లా టీడీపీ మహిళా అధ్యక్షురాలు పనబాక లక్ష్మి వెంటనే నాయుడుపేటలోని కార్యాలయం వద్దకు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన వారిని పట్టుకుని శిక్షించాలని కోరారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. అధికార గర్వంతో వైసీపీ నేతలు చెలరేగిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయానికి నిప్పు పెట్టింది వారేనని ఆరోపించారు.

More Telugu News