Telangana: నెమ్మదిగా కదులుతున్న నైరుతి రుతుపవనాలు.. తెలంగాణలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు

  • రాయలసీమ ప్రాంతంపై ఉపరితల ఆవర్తనం
  • నిన్న అత్యధికంగా కోటిపల్లిలో 11.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు
  • కౌటాలలో అత్యధికంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
Rains Expected today and tomorrow in Telangana

తెలంగాణలో నేడు, రేపు అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమ ప్రాంతంపై 3.1 కిలోమీటర్ల ఎత్తున గాలులతో కూడిన ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీనికితోడు బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాలు మెల్లగా ముందుకు కదులుతున్నాయి. వీటి ప్రభావతంలోనే వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. 

నిన్న కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. వికారాబాద్ జిల్లా కోటిపల్లిలో 11.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. బంట్వారంలో 11, దుద్యాలలో 10.2, ధవలాపూర్‌లో 9.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఫిబ్రవరి తర్వాత ఒక రోజు వ్యవధిలో 11 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు కావడం ఇదే తొలిసారని అధికారులు తెలిపారు. కాగా, నిన్న కుమురం భీం జిల్లా కౌటాలలో అత్యధికంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

More Telugu News