మధ్యప్రదేశ్‌లో విషాదం: భవనంలో అంటుకున్న మంటలు.. ఏడుగురి సజీవ దహనం

  • ఎలక్ట్రిక్ మీటర్‌లో షార్ట్ సర్క్యూట్
  • తొలుత వాహనాలకు మంటలు.. ఆపై భవనంలోకి ఎగబాకిన వైనం
  • మూడు గంటలపాటు శ్రమించి అదుపు చేసిన ఫైర్ ఫైటర్లు
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో విషాదం నెలకొంది. ఓ రెండంతస్తుల భవనంలో మంటలు చెలరేగడంతో ఏడుగురు సజీవ దహనమయ్యారు. ఇండోర్ జిల్లాలోని స్వర్ణ్ బాగ్ కాలనీలో ఈ తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. ఎలక్ట్రిక్ మీటర్‌లో షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని అగ్నిమాపక అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి సమీపంలోనే పార్క్ చేసిన వాహనాలకు మంటలు అంటుకున్నాయి. ఆ తర్వాత ఆ మంటలు భవనానికి ఎగబాకాయి. 

సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ ఫైటర్లు మూడు గంటలు కష్టపడి మంటలను అదుపు చేశారు. అనంతరం ఐదు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. తీవ్రంగా గాయపడిన మరో ఐదుగురిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉందని, ప్రమాద ఘటనపై దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.


More Telugu News

Madhya Pradesh Indore Fire Accident