Dhulipala Narendra Kumar: జగన్ కు కేసీఆర్ ప్రతి రోజు దండం పెడుతున్నారు: ధూళిపాళ్ల నరేంద్ర

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర విమర్శలు గుప్పించారు. కరెంట్ లేక రాష్ట్రం చీకట్లో మగ్గిపోయేలా జగన్ చేశారని... విద్యుత్ కోతల వల్ల రాష్ట్రంలోని పరిశ్రమలు ఏపీ నుంచి తెలంగాణకు తరలిపోతున్నాయని అన్నారు. జగన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి ప్రతి రోజు దండం పెడుతున్నారని చెప్పారు. కొత్త పరిశ్రమలు రాష్ట్రానికి రావడానికే భయపడుతున్నాయని అన్నారు.  

పేదవాడిని కొట్టి అదానీకి జగన్ పెడుతున్నారని నరేంద్ర మండిపడ్డారు. రాష్ట్రంలో సోలార్ పవర్ రూ. 2కే లభిస్తుంటే... అదానీ దగ్గర రూ. 4కు కొనాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. అదానీతో జగన్ కు చీకటి ఒప్పందాలు ఉన్నాయని... అవి ఆగకూడదనే రీతిలో జగన్ పాలన సాగుతోందని ఆరోపించారు. అదానీతో చేసుకున్న ఒప్పందాల వల్ల పేదలపై వేల కోట్ల రూపాయల భారం పడుతోందని విమర్శించారు. 

వ్యవసాయానికి ఇస్తున్న విద్యుత్ ను తొమ్మిది గంటల నుంచి ఏడు గంటలకు తగ్గించారని నరేంద్ర అన్నారు. ఇప్పుడు రోజుకు గంట సేపు కూడా విద్యుత్ సరఫరా ఉండటం లేదని చెప్పారు. పవర్ కట్లతో ఆక్వా పరిశ్రమ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోందని తెలిపారు. ఒకప్పటి వెలుగుల ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అంధకార ఆంధ్రప్రదేశ్ గా మారిందని చెప్పారు. పవర్ కట్లు, పవర్ హాలిడేల్లో జగన్ ప్రభుత్వం ప్రగతిని సాధించిందని ఎద్దేవా చేశారు.
Dhulipala Narendra Kumar
Telugudesam
Jagan
YSRCP
KCR
TRS
Gautam Adani

More Telugu News