నడక దారి భక్తులకు శుభవార్త చెప్పిన టీటీడీ

  • టీటీడీ బోర్డు సమావేశంలో కీలక నిర్ణయాలు
  • ఆమోదం తెలిపిన పాలకమండలి
  • మే 5 నుంచి శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులకు అనుమతి
  • బాలాజీ నగర్ వద్ద ఎలక్ట్రిక్ బస్ స్టేషన్ ఏర్పాటు 
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు నేడు సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు పాలకమండలి ఆమోదం తెలిపింది. టైమ్ స్లాట్ దర్శనాలు, టోకెన్లు కొనసాగించాలని టీడీపీ నిర్ణయించింది. నడక దారి భక్తులకు త్వరలోనే టోకెన్ల జారీ ప్రక్రియ ప్రారంభం అవుతుందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. శ్రీవారి మెట్టు మార్గంలో మే 5 నుంచి భక్తులను అనుమతిస్తామని చెప్పారు. 

తిరుమల బాలాజీ నగర్ వద్ద ఎలక్ట్రిక్ బస్సుల స్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. అందుకోసం 2.86 ఎకరాల స్థలం కేటాయిస్తున్నట్టు వివరించారు. శ్రీనివాస సేతు రెండో దశ పనులకు రూ.100 కోట్లు, టీటీడీ ఉద్యోగుల వసతిగృహాల ఆధునికీకరణకు రూ.19.40 కోట్లు కేటాయిస్తున్నట్టు వైవీ వెల్లడించారు. 

ఇకపై వస్తు రూపంలో విరాళాలు ఇచ్చే దాతలకు కూడా ప్రత్యేక సౌకర్యాలు కల్పించనున్నట్టు తెలిపారు.

TTD
Tirumala
Tirupati
YV Subba Reddy
Pilgrims

More Telugu News