Paidi Ramesh: టాలీవుడ్ లో విషాదం.. బిల్డింగ్ పై నుంచి పడి దర్శకుడు పైడి రమేశ్ మృతి!

  • కృష్ణానగర్ లో ఉంటున్న దర్శకుడు పైడి రమేశ్
  • ఆరేసిన బట్టలు తీస్తుండగా కరెంట్ షాక్ కొట్టిన వైనం
  • నాలుగో అంతస్తు నుంచి కింద పడి మృతి
Tollywood director Paidi Ramesh dead

టాలీవుడ్ లో వరుసగా విషాదకర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా తెలుగు సినీ పరిశ్రమ మరోసారి విషాదంలో మునిగిపోయింది. దర్శకుడు పైడి రమేశ్ మృతి చెందారు. హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణానగర్ లో ఓ భవనంపై నుంచి జారి పడి ఆయన దుర్మరణం చెందారు. ఆ బిల్డింగ్ లోని నాలుగో అంతస్తులో ఆయన ఉంటున్నారు. 

నిన్న సాయంత్రం వాకింగ్ కు వెళ్లి ఆయన తిరిగి వచ్చారు. ఈ సమయంలో వర్షం ప్రారంభం కావడంతో... బాల్కనీలో ఆరేసిన బట్టలు తీసే ప్రయత్నం చేశారు. కొన్ని బట్టలు కరెంట్ తీగలపై పడటంతో రాడ్ తో వాటిని తీసేందుకు యత్నించారు. దీంతో షాక్ కొట్టి ఆయన కింద పడిపోయారు. ఈ ఘటనలో ఆయన అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. 

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 2018లో 'రూల్' అనే సినిమాను ఆయన తెరకెక్కించారు. మరో సినిమాను తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉండగానే ఈ దుర్ఘటన సంభవించింది. ఒక యంగ్ డైరెక్టర్ మృతి చెందడంపై సినీ ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News