పువ్వాడను కమ్మ కులం నుంచి బహిష్కరించాలన్న రేవంత్... ఏ విచారణకైనా సిద్ధమన్న పువ్వాడ

రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక తొలిసారి ఖమ్మం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ కార్యకర్తలను ఉత్సాహపరిచేలా ప్రసంగించారు. ఈ క్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పువ్వాడ అక్రమాలపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయని, ఆరోపణల పట్ల పువ్వాడే స్వయంగా సీబీఐ విచారణ కోరాలని అన్నారు. 

కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి భయపెట్టాలని చూస్తున్నాడని, కాంగ్రెస్ కార్యకర్తలు భయపడాల్సిన అవసరంలేదని రేవంత్ స్పష్టం చేశారు. తమ కార్యకర్తలపై వేధింపులకు పాల్పడే అధికారుల పేర్లను డైరీలో రాసిపెడుతున్నామని, రేపు వారు ఎక్కడున్నా తీసుకొచ్చి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని స్పష్టం చేశారు. పువ్వాడను కమ్మ పెద్దలు కులం నుంచి కూడా బహిష్కరించాలని పిలుపునిచ్చారు. 

ఈ నేపథ్యంలో, మంత్రి పువ్వాడ స్పందించారు. తాను ఏ విచారణకైనా సిద్ధమేనని అన్నారు. భూములు కబ్జా చేశానని తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, కావాలంటే సీబీఐతో దర్యాప్తు చేయించుకోవాలని సవాల్ విసిరారు.

Revanth Reddy
Puvvada Ajay Kumar
Khammam
Congress
TRS

More Telugu News