YSRCP: స‌మ‌స్య ప‌రిష్క‌రించ‌మ‌న్న మ‌హిళ‌పై మండిపడిన వైసీపీ ఎమ్మెల్యే

  • విజ‌య‌న‌గ‌రంలో ఘ‌ట‌న
  • వాట‌ర్ ట్యాంక్ శంకుస్థాప‌న‌కు వ‌చ్చిన ఎమ్మెల్యే
  • డ్రైనేజీ స‌మ‌స్య‌ను ప్ర‌స్తావించిన స్థానిక మ‌హిళ‌
  • స‌మ‌స్య‌ను ఎక్క‌డ చెప్పాలో తెలియ‌దా? అంటూ ఎమ్మెల్యే ఆగ్రహం 
ysrcp mla angry over woman

వైసీపీ సీనియ‌ర్ నేత‌, విజ‌య‌న‌గ‌రం ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామికి కోపం వ‌చ్చింది. మురుగు నీటి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని కోరిన ఓ మ‌హిళ‌పై ఎమ్మెల్యే ఆగ్రహించారు. స‌మ‌స్య‌ను ఎక్క‌డ ప్ర‌స్తావించాలో తెలియదా? అంటూ ఆ మ‌హిళ‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన కోల‌గ‌ట్ల.. కూర్చోవాలంటూ రంకెలేశారు. మంగ‌ళ‌వారం విజ‌య‌న‌గ‌రం న‌ర‌క‌పాల‌క సంస్థ ప‌రిధిలోని కేఎల్ పురంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది.

కేఎల్ పురంలో కొత్త‌గా నిర్మించ‌నున్న వాట‌ర్ ట్యాంకు నిర్మాణం కోసం శంకుస్థాప‌న చేసేందుకు ఎమ్మెల్యే హోదాలో కోల‌గ‌ట్ల వ‌చ్చారు. ఈ కార్య‌క్ర‌మం పూర్తి కాగానే... అక్క‌డికి వ‌చ్చిన ప్ర‌జ‌ల‌తో ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు. ఈ సంద‌ర్భంగా త‌మ కాల‌నీలో డ్రైనేజీ స‌మ‌స్య ఉంద‌ని, కాలువ లేని కార‌ణంగా ఇబ్బందులు ప‌డుతున్నామ‌ని ఓ మ‌హిళ మునిసిప‌ల్ అధికారుల‌కు చెప్పేందుకు య‌త్నించారు.

ఈ మాట‌లు విన్నంత‌నే తీవ్ర ఆగ్ర‌హానికి గురైన ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల స‌ద‌రు మ‌హిళ‌పై చిందులేశారు. స‌మ‌స్య‌ను ఎక్క‌డ ప్ర‌స్తావించాలో తెలియ‌దా? అంటూ ఆమెను నిల‌దీశారు. స్థానిక కార్పొరేటర్‌కు చెప్ప‌కుండా త‌మ వ‌ద్ద‌కు వ‌స్తే ఎలాగంటూ నిలదీశారు. ముందు వాట‌ర్ ట్యాంక్ కావాలా? వ‌ద్దా? అంటూ ఆమెపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎమ్మెల్యే ఆగ్ర‌హంతో ఊగిపోవ‌డం చూసిన మ‌హిళ మిన్న‌కుండిపోయారు.

More Telugu News