Prithvi Shaw: పృథ్వీ షా, వార్నర్ విధ్వంసం... 215 పరుగులు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్

  • ఐపీఎల్ లో నేడు ఢిల్లీ వర్సెస్ కోల్ కతా
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్ కతా
  • కోల్ కతా బౌలింగ్ ను ఊచకోత కోసిన ఢిల్లీ బ్యాటర్లు
  • పృథ్వీ షా, వార్నర్ అర్ధసెంచరీలు
  • ఆఖర్లో అక్షర్, శార్దూల్ మెరుపు ఇన్నింగ్స్
Delhi Capitals smashes KKR bowling

పరాజయాల బాటలో నడుస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్... నేడు కోల్ కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ లో జూలు విదిల్చింది. ఓపెనర్లు పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ విరుచుకుపడడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 215 పరుగుల భారీ స్కోరు సాధించింది. తొలి బంతి నుంచే పృథ్వీ షా దూకుడు కొనసాగింది. పృథ్వీ షా 29 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 51 పరుగులు చేయగా, వార్నర్ 45 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 61 పరుగులు చేశాడు. వీరిద్దరూ తొలి వికెట్ కు 93 పరుగులు జోడించడం విశేషం. 

కెప్టెన్ రిషబ్ పంత్ కూడా ధాటిగా ఆడాడు. పంత్ 14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 27 పరుగులు చేశాడు. చివర్లో అక్షర్ పటేల్ (14 బంతుల్లో 22 నాటౌట్), శార్దూల్ ఠాకూర్ (11 బంతుల్లో 29 నాటౌట్) వేగంగా ఆడడంతో ఢిల్లీ జట్టు 200 మార్కు దాటింది. శార్దూల్ ఠాకూర్ 1 ఫోర్, 3 సిక్సులు బాదడం విశేషం. 

కోల్ కతా బౌలర్లలో సునీల్ నరైన్ 2, ఉమేశ్ యాదవ్ 1, ఆండ్రీ రసెల్ 1 వికెట్ పడగొట్టారు. ఆస్ట్రేలియా స్పీడ్ స్టర్ పాట్ కమిన్స్... బౌలింగ్ లో అర్ధసెంచరీ సాధించాడు. 4 ఓవర్లు వేసిన కమిన్స్ ఒక్క వికెట్టూ తీయలేకపోగా, ఏకంగా 51 పరుగులు సమర్పించుకున్నాడు.

More Telugu News