non veg: పెద‌కాకాని శివాల‌యం క్యాంటీన్‌ వ‌ద్ద మాంసాహారం.. క్యాంటీన్ సీజ్

  • అన్నదానానికి ఆ క్యాంటీన్‌ నుంచే భోజనం సరఫరా
  • ఆ క్యాంటీన్ వ‌ద్ద‌ తాజాగా కోడి మాంసం క‌న‌ప‌డ‌డంతో భ‌క్తుల ఆగ్ర‌హం 
  • నిర్వాహకుల లైసెన్స్‌ను రద్దు చేశామన్న అధికారులు
  • హిందూ సంఘాల ఆందోళ‌న‌లు
non veg at pedakakani shivalay

గుంటూరు జిల్లాలోని పెదకాకాని మల్లేశ్వరస్వామి శివాలయం వ‌ద్ద క‌ల‌ల‌కం చెల‌రేగింది. భక్తులకు అల్పాహారం, అన్నదానానికి భోజనాన్ని అక్కడి క్యాంటీన్‌ నుంచి సరఫరా చేస్తారు. ఆ క్యాంటీన్‌లో తాజాగా కోడి మాంసం వండిన‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌లే వైసీపీకి చెందిన స్థానిక ఎంపీటీసీ భర్త ఈ క్యాంటీన్‌ను లీజుకి తీసుకుని నడుపుతున్నారు. భక్తులకు ఆహార పదార్థాలతో పాటు బయట వారి నుంచి ఆర్డర్లు తీసుకుంటూ ఇక్క‌డి నుంచే క్యాటరింగ్‌ నిర్వహిస్తున్నారు. 

తాజాగా క్యాంటీన్ వ‌ద్ద‌ మాంసం కూర కూడా కనిపించడంతో భక్తులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీంతో క్యాంటీన్‌ను దేవాదాయశాఖ అధికారులు మూసివేసి చ‌ర్య‌లు తీసుకున్నారు. క్యాంటీన్‌ను సీజ్‌ చేశామని, అలాగే, నిర్వాహకుల లైసెన్స్‌ను రద్దు చేశామని దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌ ఈమని చంద్రశేఖర్‌రెడ్డి మీడియాకు వివ‌రించారు. అయితే, ఆ మాంసాహారాన్ని బయటే వండార‌ని, ఆ ఆహార ప‌దార్థాల వాహ‌నం ఆలయ ప్రాంగణంలోకి వచ్చినట్లు నిర్వాహకులు త‌మ‌కు చెప్పారని చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. 

నిర్వాహకులకు ఇప్ప‌టికే షోకాజ్‌ నోటీసు కూడా ఇచ్చామని చెప్పారు. మల్లేశ్వర స్వామి శివాలయం వ‌ద్ద మాంసాహారం వివాదంపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని వివ‌రించారు. నిర్వాహకుల నుంచి పూర్తిస్థాయిలో వివరణ తీసుకుని తదుపరి చర్యలు తీసుకుంటామ‌ని అన్నారు. ఆల‌యం వ‌ద్ద‌ గతంలోనూ ఇటువంటి ఘటనలు ఏమైనా జరిగాయా? అన్న విష‌యంపై కూడా విచారిస్తున్నామ‌ని చెప్పారు. క్యాంటీన్ నిర్వ‌హ‌ణ‌ను ఇతర మతస్థులు చేస్తున్నట్లు తమకు తెలియదని చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. 

మరోపక్క ఆల‌యం వ‌ద్ద చోటు చేసుకున్న ఘ‌న‌ట‌పై హిందూ ధార్మిక సంఘాలు నిర‌స‌నలు తెలుపుతున్నాయి. ఈవో కార్యాలయం వద్ద హిందూ సంఘాల నేతలు బైఠాయించి నినాదాలు చేశారు. దేవాల‌య‌ పవిత్రతను దెబ్బతీసేలా ఇటువంటి ఘ‌ట‌న‌లు జ‌రుగుతున్న‌ప్ప‌టికీ అధికారులు ఎందుకు ప‌ట్టించుకోవడం లేద‌ని ప్ర‌శ్నించారు.

More Telugu News