Vasireddy Padma: గుంటూరు జిల్లా మైనర్ బాలిక అత్యాచారం ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్న మహిళా కమిషన్

Women Commission Chair Person Vasireddy Padma talks about minor girl incident
  • పేరేచర్లకు చెందిన మైనర్ బాలిక దారుణం
  • ఇప్పటిదాకా 64 మంది అరెస్ట్
  • నేడు బాధితురాలితో మాట్లాడిన వాసిరెడ్డి పద్మ

కొన్ని నెలల కిందట వెలుగుచూసిన గుంటూరు జిల్లా పేరేచర్లకు చెందిన మైనర్ బాలిక అత్యాచారం కేసులో ఇప్పటివరకు పోలీసులు 64 మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి సరిగా దర్యాప్తు చేయడం లేదంటూ వచ్చిన తాజా ఆరోపణలపై రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా దృష్టి సారించింది. ఓ సంరక్షణ కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న బాధితురాలిని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ నేడు కలిశారు. 

దర్యాప్తులో ఏమైనా లోపాలు ఉన్నాయా? అని ఆమెను అడిగి తెలుసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి గుంటూరు అర్బన్ ఎస్పీతోనూ ఆమె మాట్లాడారు. అంతేకాదు, మహిళా కమిషన్ కార్యాలయానికి బాధితురాలి తండ్రిని కూడా పిలిపించి మాట్లాడారు. బాధితురాలిని ఎప్పుడు దత్తత తీసుకున్నారన్న వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కేసును విభిన్న కోణాల్లో సమగ్ర దర్యాప్తునకు ఆదేశించినట్టు వాసిరెడ్డి పద్మ వెల్లడించారు. బాధితురాలికి జరిగిన అన్యాయం పరమ దుర్మార్గం అని పేర్కొన్నారు. 

పుండుమీద కారంలా ఈ ఘటనను కొందరు స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటివి చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. ఈ ఘటన వెనుక ఎవరు ఉన్నా వదిలే ప్రసక్తే లేదని అన్నారు.

  • Loading...

More Telugu News