ఐపీఎల్ దగ్గరపడుతున్న వేళ ముంబై ఇండియన్స్ కు షాక్!

  • తొలి మ్యాచ్ కు సూర్యకుమార్ యాదవ్ దూరం
  • చేతి గాయం నుంచి కోలుకోని స్కై
  • ప్రస్తుతం ఎన్ సీఏలో చికిత్స
  • మెడికల్ టీం సూచనల మేరకేనంటున్న బీసీసీఐ వర్గాలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తాజా సీజన్ దగ్గరపడుతున్న వేళ ముంబై ఇండియన్స్ జట్టుకు గట్టి దెబ్బ తగిలింది. ఈ నెల 27న ఢిల్లీ క్యాపిటల్స్ తో జరగనున్న ముంబై తొలి మ్యాచ్ కు కీలకమైన సూర్యకుమార్ యాదవ్ అందుబాటులో ఉండడం లేదు. అతడి చేతి బొటనవేలికి అయిన గాయం నయం కాలేదని తెలుస్తోంది. 

‘‘చేతి వేలి ఫ్రాక్చర్ తో ప్రస్తుతం సూర్య కుమార్ యాదవ్.. ఎన్ సీఏ పునరావాస శిబిరంలో చికిత్స పొందుతున్నాడు. ఆ గాయం నుంచి అతడింకా కోలుకోలేదు. కాబట్టి ఐపీఎల్ లో ముంబై తొలి మ్యాచ్ ను అతడు ఆడుతాడా? లేదా? అన్నది అనుమానమే. గాయం వల్ల అతడిని తొలి గేమ్ ఆడవద్దని బీసీసీఐ మెడికల్ టీం సూచించి ఉండొచ్చు’’ అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. 

కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సూర్యకుమార్ యాదవ్ చాలా కీలక ఆటగాడు. రోహిత్, పొలార్డ్ తో పాటు అతడిని కూడా జట్టు రిటెయిన్ చేసుకుంది. ఈ నేపథ్యంలోనే అతడి గాయం కలవరపెడుతోంది. అయితే, తొలి మ్యాచ్ తర్వాత రెండో మ్యాచ్ కు ముంబైకి ఐదు రోజుల సమయం ఉంది. ఈలోపు అతడు కోలుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ముందు జాగ్రత్తగానే అతడిని తొలి మ్యాచ్ కు దూరం పెట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.


More Telugu News

Cricket Mumbai Indians IPL Surya Kumar Yadav