Singareni: సమ్మె సైరన్ మోగించిన సింగరేణి కార్మిక సంఘాలు

Singareni Collieries employee unions going for strike
  • సింగరేణిని ప్రైవేటీకరణ చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు
  • ఈ నెల 28, 29 తేదీల్లో సింగరేణి కార్మికుల సమ్మె
  • గత డిసెంబర్ లో కూడా సమ్మె చేపట్టిన కార్మికులు
తెలంగాణ కిరీటంలో కలికితురాయి అయిన సింగరేణిని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సింగరేణి కార్మికులు సమ్మె చేపట్టబోతున్నారు. ఈ నెల 28, 29 తేదీల్లో సమ్మెను చేపట్టబోతున్నట్టు సింగరేణి యాజమాన్యానికి కార్మిక సంఘాలు నోటీసులు అందించాయి. నోటీసులు ఇచ్చిన వాటిలో ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, ఐఎన్టీయూసీ కార్మిక సంఘాలు ఉన్నాయి. 

సత్తుపల్లి బ్లాక్ 3, శ్రావణపల్లి బ్లాక్, కొయ్యగూడెం బ్లాక్, కళ్యాణిఖని బ్లాక్ 6లను కేంద్రం ప్రభుత్వం వేలం వేయడానికి సిద్ధమైన నేపథ్యంలో కార్మిక సంఘాలు సమ్మెకు వెళ్తున్నాయి. ప్రైవేటీకరణను ఆపాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ లో కూడా సింగరేణి కార్మికులు సమ్మె చేపట్టారు. డిసెంబర్ 9 నుంచి మూడు రోజుల పాటు సమ్మె నిర్వహించి తమ వ్యతిరేకతను వ్యక్తపరిచారు. అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా కేంద్ర వైఖరిని వ్యతిరేకిస్తోంది. సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తే సమరమే అంటూ కేంద్రానికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
Singareni
Strike
Coal Blocks
Privatisation

More Telugu News