అంగన్‌వాడీ కార్యకర్తల ‘చలో విజయవాడ’.. అడ్డుకునేందుకు సెలవులు రద్దు చేసిన ప్రభుత్వం

మధ్యాహ్న భోజన, అంగన్‌వాడీ కార్యకర్తలు, నాలుగో తరగతి ఉద్యోగులు నేడు చేపట్టిన ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు నేడు సెలవులు రద్దు చేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు.

అందరూ అందుబాటులో ఉండాలని, హెడ్‌క్వార్టర్‌ను విడిచిపెట్టి వెళ్లరాదని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఉద్యోగులందరూ హాజరు పట్టికలో సంతకాలు చేయాలని, వాటిని స్కానింగ్ చేసి ఉదయం 10.45 గంటలకల్లా ఉన్నతాధికారులకు పంపాలని ఆదేశించారు. ఫలితంగా విధులకు అందరూ హాజరయ్యేలా చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం. 

అంతేకాదు, ‘చలో విజయవాడ’లో ఎవరూ పాల్గొనవద్దని కూడా పేర్కొంది. సెక్షన్ 144 కింద విజయవాడలో నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని, వాటిని ఉల్లంఘించి ‘చలో విజయవాడ’లో పాల్గొంటే చర్యలు తప్పవని హెచ్చరించింది. తమకేమైనా సమస్యలు ఉంటే ఉన్నతాధికారులకు వినతిపత్రాలు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించింది.

Chalo Vijayawada
Andhra Pradesh
Leaves
Anganwadi

More Telugu News