మెలిటోపోల్ మేయర్ను కిడ్నాప్ చేసిన రష్యన్ దళాలు.. తీవ్రంగా స్పందించిన జెలెన్స్కీ
- 17వ రోజుకు చేరుకున్న యుద్ధం
- రష్యన్ సేనలకు సహకరించేందుకు నిరాకరించిన ఇవాన్
- మెలిటోపోల్ సహా రష్యన్ సేనల నియంత్రణలో పలు నగరాలు
మెలిటోపోల్, ఖేర్సన్, బెర్డీయాన్స్క్, స్టారోబిలిస్క్, నోవోప్స్కోవ్ వంటి నగరాలు ప్రస్తుతం రష్యన్ దళాల నియంత్రణలో ఉన్నాయి. అయితే ఆయా నగరాల పౌరులు మాత్రం రష్యన్ సేనలను ఎదిరిస్తూనే ఉన్నారు. ఉక్రెయిన్ దక్షిణ నగరమైన మెలిటోపోల్ రష్యన్ సేనల నియంత్రణలోకి వెళ్లి చాలా రోజులు అయింది. అక్కడ ఇంటర్నెట్ పూర్తిగా నిలిచిపోయింది. ఫలితంగా వాట్సాప్, టెలిగ్రామ్ వంటి సేవలు నిలిచిపోయాయి. దీంతో స్నేహితులు, కుటుంబాల మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి.
ఒకవేళ ఇంటర్నెట్ కనెక్ట్ అయినా అది కొన్ని నిమిషాలకే పరిమితం అవుతోంది. తాజాగా నగర మేయర్ ఇవాన్ ఫెడెరోవ్ను రష్యా దళాలు కిడ్నాప్ చేసినట్టు తెలుస్తోంది. అజ్ఞాతంలో ఉన్న ఆయన రష్యా సేనలకు సహకరించేందుకు నిరాకరించడంతో కిడ్నాప్ చేసినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా రష్యా దళాలకు సహకరించేది లేదని ఇవాన్ ఇది వరకే స్పష్టం చేశారు.
వారు తమకు సాయం చేయడం లేదని, తాము కూడా వారి సాయాన్ని అర్థించబోమని ఇవాన్ ఇటీవల తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆయనను కిడ్నాప్ చేసినట్టు తెలుస్తోంది. ఇవాన్ కిడ్నాప్పై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్రంగా స్పందించారు. ప్రజాస్వామ్యంపై ఇది యుద్ధ నేరమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.