విజయంపై ఆశలు వదులుకోని అఖిలేశ్.. ఎవరూ టీవీలు చూడొద్దంటూ కేడర్ కు సూచన
- కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉండాలని ఆదేశాలు
- 100 స్థానాల్లో కేవలం 500 ఓట్ల తేడానే ఉందని ధీమా
- ప్రజాస్వామ్య సైనికులే అధికారంలోకి వస్తారని కామెంట్
‘‘టీవీల్లో వస్తున్న కథనాలు, ట్రెండ్స్ చూసి సమాజ్ వాదీ పార్టీ కార్యకర్తలు, తమ భాగస్వాములెవరూ ఆందోళన చెందవద్దు. కౌంటింగ్ బూత్ ల వద్దే అందరూ ఉండండి. టీవీలు చూడకండి. చివరకు గెలిచేది ప్రజాస్వామ్యమే. సమాజ్ వాదీ పార్టీ కూటమే విజయం సాధిస్తుంది’’ అని ఆయన పార్టీ ట్వీట్ చేసింది.
వంద స్థానాల్లో ఓట్ల తేడా కేవలం 500 మాత్రమే ఉందని, కాబట్టి, పార్టీ కార్యకర్తలు, ఆఫీస్ బేరర్లు, నేతలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. కాగా, విజయమనే సర్టిఫికెట్ తోనే ప్రజాస్వామ్య సైనికులు అధికారంలోకి తిరిగొస్తారంటూ ఇవాళ ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభానికి ముందు ఆయన ట్వీట్ చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలే ప్రజాస్వామ్యానికి తీర్థయాత్రస్థలాలని, అక్కడకు వెళ్లి ఉండాలని కేడర్ కు సూచించారు.