గవర్నర్ ప్రసంగం లేకుంటే సభ్యుల హక్కులు హరించినట్టే: తమిళిసై
- గవర్నర్ ప్రసంగం లేకుండానే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు
- అసంతృప్తిని వ్యక్తం చేసిన గవర్నర్ తమిళిసై
- ప్రభుత్వ పనితీరును పరిశీలించాల్సిందేనని వ్యాఖ్య
- రాజ్ భవన్ నుంచి ప్రకటన విడుదల
గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలను ప్రారంభిస్తున్న తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగం లేకుండానే సభ నిర్వహించాలని నిర్ణయించిన ప్రస్తుత ప్రభుత్వ పనితీరును పరిశీలించాల్సి ఉందని రాజ్ భవన్ విడుదల చేసిన ఆ ప్రకటనలో ఆమె పేర్కొన్నారు.
గవర్నర్ ప్రసంగం లేకుండా చేస్తే సభ్యులు చర్చించే హక్కును కోల్పోయినట్టేనని ఆమె అభిప్రాయపడ్డారు. సాంకేతికంగా గవర్నర్ ప్రసంగం తప్పనిసరి కాకపోవచ్చని పేర్కొన్న ఆమె.. గవర్నర్ ప్రసంగం లేకపోయినప్పటికీ బడ్జెట్ సమర్పణను స్వాగతిస్తున్నట్లు తెలిపారు.