Telangana: దక్షిణ గాలుల ప్రభావం.. తెలంగాణలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

నిన్నమొన్నటి వరకు చలిగాలులతో ఉక్కిరిబిక్కిరి అయిన తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. దక్షిణ, ఆగ్నేయ భారత ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో తెలంగాణలోకి గాలులు వీస్తుండడంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 

నిన్న మధ్యాహ్నం రాష్ట్రంలోనే అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా చాప్రాలలో 38.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ స్థాయిలో ఉష్ణోగ్రత నమోదు కావడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. ఇక అత్యల్పంగా రంగారెడ్డి జిల్లా రెడ్డిపల్లిలో 12.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 

రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం ఉదయం వేళ పొగమంచు కురుస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఇంకొన్ని ప్రాంతాల్లో గాలిలో తేమ సాధారణం కంటే 28 శాతం అధికంగా ఉందని, రాష్ట్రంలో నేడు, రేపు వాతావరణం పొడిగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
Telangana
Adilabad District
Temperatutes

More Telugu News