Cricket: రిషబ్ పంత్ ను పక్కనపెట్టాలంటున్న టీమిండియా మాజీ ఆల్ రౌండర్!

నిలకడగా ఆడాల్సిన టైంలో అనవసరమైన చెత్త షాట్ ఆడి వికెట్ పారేసుకున్న వికెట్ కీపర్ రిషబ్ పంత్ పై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మాజీలు అతడి ఆటతీరుపై మండిపడుతున్నారు. జొహాన్నెస్ బర్గ్ టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్ లో రబాడ బౌలింగ్ లో బౌన్సర్ ను ఒంటి చేత్తో షాట్ ఆడబోయి కీపర్ కు క్యాచ్ ఇచ్చి పంత్ ఔటైన సంగతి తెలిసిందే. దానిపై టీమిండియా మాజీలు విమర్శలు ఎక్కుపెట్టారు. అది అనవసరమైన షాట్ అంటూ సునీల్ గవాస్కర్ ఇప్పటికే వ్యాఖ్యానించాడు.

తాజాగా టీమిండియా మాజీ ఆలర్ రౌండర్ మదన్ లాల్ స్పందించాడు. 'పంత్ మ్యాచ్ విన్నర్ అయితే కావొచ్చుగానీ.. జట్టు అవసరాలేంటో కూడా అతడు గ్రహించగలగాలి' అంటూ అసహనం వ్యక్తం చేశాడు. మూడో టెస్టుకు అతడిని తప్పించి వృద్ధిమాన్ సాహాను తీసుకోవాలని సూచించాడు. సాహా సందర్భానికి తగ్గట్టు ఆడే బ్యాట్స్ మన్ అని చెప్పాడు.

‘‘టెస్ట్ క్రికెట్ లో ఎలా బ్యాటింగ్ చేయాలన్నది పంత్ నిర్ణయించుకోవాలి. ఆ విషయంలో అనుమానాలుంటే అతడిని పక్కన పెట్టడమే మంచిది. అతడు మ్యాచ్ విన్నరే. కానీ, ఇలా బ్యాటింగ్ చేయకూడదు. తన కోసం కాకుండా జట్టు కోసం బ్యాటింగ్ చేయాలి’’ అని మదన్ లాల్ అన్నాడు.
Cricket
Madan Lal
Rishabh Pant

More Telugu News