​పదవీ విరమణ వయసు పెంపు ఊహించలేదు... మేం అడగకుండానే ఇళ్ల స్థలాలు ​ప్రకటించారు: బొప్పరాజు హర్షం

ఫిట్ మెంట్ పెంచుతున్నట్టు సీఎం జగన్ ప్రకటించడంపై ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పందించారు. పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచడాన్ని స్వాగతించారు. సొంత ఇల్లు లేని ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వమే స్థలం కేటాయిస్తుందన్న నిర్ణయం పట్ల సంతోషం వెలిబుచ్చారు. పదవీ విరమణ వయసు పెంపు తాము ఏమాత్రం ఊహించలేదని, సీఎం జగన్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని బొప్పరాజు కొనియాడారు.

ఉద్యోగ సంఘాలు అడగకపోయినా ఇంటి స్థలాల విషయంలో నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. ఉద్యోగుల సొంతింటి కలను నిజం చేస్తున్నారని తెలిపారు. సీఎం నోట ఇళ్ల స్థలాల ప్రకటన వస్తుందని తాము అనుకోలేదని చెప్పారు. పెండింగ్ డీఏలపై సీఎం నిర్ణయం సంతోషదాయకమని అన్నారు.

హెల్త్ కార్డుల సమస్యను రెండు వారాల్లోపు పరిష్కరిస్తామంటూ టైమ్ లైన్ విధించారని, తమతో పాటు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా 1వ తేదీ నుంచే జీతాలు పెంపుదల చేయడం శుభపరిణామం అని బొప్పరాజు పేర్కొన్నారు. సీఎం ఎదుట తాము ప్రస్తావించిన ప్రధాన సమస్యలన్నీ పరిష్కారం అయ్యాయని బొప్పరాజు పేర్కొన్నారు.

Bopparaju Venkateswarlu
CM Jagan
Retirement Age
Plots
Employees
Andhra Pradesh

More Telugu News