కోహ్లీ ప్రెస్ మీట్లకు రాకపోవడానికి కారణం ఇదే: ద్రావిడ్

Virat Kohli will speak to media on his 100 test day says Rahul Dravid
  • వందో టెస్టు రోజున మీడియాతో మాట్లాడతానని చెప్పాడు
  • మ్యాచ్ ఫలితాలను తాను నిర్ణయించలేనన్న ద్రావిడ్
  • జనవరి 11న జరిగే మూడో టెస్టు కోహ్లీకి వందో టెస్టు
టీమిండియా ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో తొలి టెస్టును భారత్ కైవసం చేసుకుంది. మరోవైపు సౌతాఫ్రికా టూర్ ప్రారంభమయినప్పటి నుంచి ఇప్పటి వరకు కెప్టెన్ కోహ్లీ మీడియా ముందుకు రాలేదు. ఇది అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దీనిపై హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ స్పందించారు.

మీడియా ముందుకు కోహ్లీ రాకపోవడానికి ప్రత్యేక కారణం ఏదీ లేదని ద్రావిడ్ అన్నారు. తన వందో టెస్టు రోజున మీడియాతో మాట్లాడతానని కోహ్లీ తనకు చెప్పాడని తెలిపారు. ఆ రోజున కోహ్లీని మీరు ఎన్ని ప్రశ్నలైనా అడగొచ్చని చెప్పారు. మ్యాచ్ లను గెలవడంలో తన పాత్ర గురించి మీడియా ప్రశ్నించగా... మ్యాచ్ ఫలితాలను తాను నిర్ణయించలేనని... అయితే జట్టు సభ్యులు మెరుగ్గా రాణించేలా వారిని సన్నద్ధం చేయగలనని అన్నారు. మరోవైపు జనవరి 11న కేప్ టౌన్ లో జరిగే మూడో టెస్టు కోహ్లీకి వందో టెస్టు కాబోతోంది.

కాగా, వన్డే కెప్టెన్సీ నుంచి కోహ్లీని తప్పించడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తనకు చెప్పకుండానే కెప్టెన్సీ నుంచి తొలగించారని కోహ్లీ చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని మరింత పెంచాయి. కోహ్లీ వ్యాఖ్యలపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ... కోహ్లీ అలా మాట్లాడి ఉండకూడదని అన్నారు. కెప్టెన్సీ నుంచి తొలగిస్తున్నామనే విషయాన్ని కోహ్లీకి చెప్పామని సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ చేతన్ శర్మ తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో మీడియా ముందుకు కోహ్లీ రాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
Go Back to Shorts
Rahul Dravid
Virat Kohli
Team New Zealand
Press Meet

More Telugu News