ఇంత దిగజారుడుతనం ఎందుకు?: సోము వీర్రాజుపై సజ్జల విమర్శలు

Sajjala slams Somu Veerraju on his remarks over YCP govt
  • వైసీపీ సర్కారుపై సోము వీర్రాజు వ్యాఖ్యలు
  • టీడీపీ స్క్రిప్టునే వీర్రాజు చదివారని సజ్జల విమర్శలు
  • చంద్రబాబు వీళ్లతో తోలుబొమ్మలాట ఆడిస్తున్నారని వ్యాఖ్యలు
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వైసీపీ సర్కారుపై ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. అన్నపూర్ణను అప్పులాంధ్రప్రదేశ్ గా చేశారని మండిపడ్డారు. మద్యం ధరలు పెంచి పేదల రక్తం తాగుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీ లీజుల గురించి మేం మాట్లాడితే చొక్కాలు ఊడిపోతాయంటూ వైసీపీ మంత్రులకు ఘాటు హెచ్చరికలు కూడా చేశారు. దీనిపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.

టీడీపీ కార్యాలయంలో తయారైన స్క్రిప్టునే సోము వీర్రాజు మాట్లాడుతున్నారని విమర్శించారు. మరీ ఇంత దిగజారుడుతనం ఎందుకో అర్థంకావడంలేదని వ్యాఖ్యానించారు. టీడీపీ, బీజేపీలకు సొంత అజెండా లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. గతంలో అమరావతి కుంభకోణాలమయం అన్న బీజేపీ... ఇప్పుడు అధికారం ఇస్తే మూడేళ్లలో అమరావతి రాజధాని పూర్తిచేస్తామని చెబుతోందని మండిపడ్డారు.

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ తథ్యమని చెప్పేది బీజేపీ నేతలే అని, మళ్లీ, వైసీపీ ఎంపీలు ప్రైవేటీకరణపై ఎందుకు పోరాడడంలేదని వాళ్లే ప్రశ్నిస్తారని సజ్జల విమర్శించారు. చంద్రబాబు వీళ్లతో తోలుబొమ్మలాట ఆడిస్తున్నారని వ్యాఖ్యానించారు. టీడీపీకి అనుబంధ విభాగంలా బీజేపీ తయారైందని అన్నారు. విభజన సమస్యలపై బీజేపీ ఎందుకు మాట్లాడడంలేదని సజ్జల నిలదీశారు.
Go Back to Shorts
Sajjala Ramakrishna Reddy
Somu Veerraju
YSRCP
Chandrababu
TDP
BJP
Andhra Pradesh

More Telugu News