అమెరికాలో రోడ్డు ప్రమాదం.. జనగామకు చెందిన కుటుంబానికి తీవ్ర గాయాలు.. 13 ఏళ్ల బాలుడి మృతి!

  • 16 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లి స్థిరపడిన రాంచంద్రారెడ్డి కుటుంబం
  • స్నేహితుడి బర్త్‌డే వేడుకలకు హాజరై వస్తుండగా ప్రమాదం
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భార్య, భర్త, కుమార్తె
అమెరికాలోని లాస్‌ఏంజెలెస్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో జనగామ జిల్లాకు చెందిన ఓ కుటుంబం తీవ్రంగా గాయపడగా, వారి కుమారుడు ప్రాణాలు కోల్పోయాడు. జిల్లాలోని లింగాలఘనపురం మండలం బండ్లగూడేనికి చెందిన రాంచంద్రారెడ్డి కుటుంబం 16 సంవత్సరాల క్రితం అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన రాంచంద్రారెడ్డి ఆదివారం రాత్రి స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలకు భార్య, పిల్లలతో కలిసి వెళ్లారు.

తిరిగి వస్తున్న సమయంలో లాస్‌ఏంజెలెస్‌లోని ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారు ఆపారు. మద్యం మత్తులో కారును డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన ఓ మహిళ వెనక నుంచి రాంచంద్రారెడ్డి కారును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు వెనక సీట్లో కూర్చున్న రాంచంద్రారెడ్డి 13 ఏళ్ల కుమారుడు అర్జిత్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా, రాంచంద్రారెడ్డి, ఆయన భార్య రజనీరెడ్డి, కుమార్తె అక్షితారెడ్డి (15) తీవ్రంగా గాయపడ్డారు.

America
Los Angeles
Road Accident
Jangaon District
Telangana

More Telugu News