విశాఖ రియల్టర్ విజయవాడలో దారుణ హత్య.. యువతితో సన్నిహిత సంబంధమే కారణమా?

  • విజయవాడలో బిల్డర్‌గా స్థిరపడిన అప్పలరాజు
  • మూడేళ్ల క్రితం కుటుంబాన్ని విశాఖకు తీసుకొచ్చి అక్కడే ఉంచిన వైనం
  • హత్య అనంతరం ఆయన ఒంటిపై బంగారం మాయం
  • పలు కోణాల్లో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
విశాఖపట్టణానికి చెందిన ఓ బిల్డర్ విజయవాడలో దారుణ హత్యకు గురికావడం సంచలనమైంది. నగరంలోని ఎంవీపీ కాలనీకి చెందిన పీతల అప్పలరాజు అలియాస్ రాజు (47) విజయవాడలో బిల్డర్‌గా స్థిరపడ్డారు. అక్కడే ఓ అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. భార్య ఉమ, ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్నారు. కుమారుడు ప్రవీణ్ ఎంబీఏ చదువుతుండగా, కుమార్తె రేష్మకు ఆగస్టులో వివాహమైంది.

కాగా, మూడేళ్ల క్రితం భార్య ఉమ, పిల్లలను విశాఖ తీసుకొచ్చి అక్కడే ఉంచారు. ఆయన మాత్రం విజయవాడలోనే ఉంటున్నారు. ఈ క్రమంలో దసరా పండుగ కోసం విశాఖ వచ్చిన అప్పలరాజు ఐదు రోజుల క్రితం విజయవాడ తిరిగి వెళ్లారు.

అప్పలరాజు, ఆయన వద్ద పనిచేసే సాయికుమార్ అనే వ్యక్తి ఇద్దరూ ఒకే భవనంలో విజయవాడలో అద్దెకు ఉంటున్నారు. అప్పలరాజు వద్ద పనిచేసే వెంకటేశ్ అనే మరో వ్యక్తి నిన్న సాయికుమార్‌ను కలిసి ఎన్నిసార్లు ఫోన్ చేసినా అప్పలరాజు లిఫ్ట్ చేయడం లేదని చెప్పాడు. దీంతో ఇద్దరూ కలిసి పైకి వెళ్లి చూడగా ఆయన హత్య విషయం వెలుగుచూసింది.

వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. అప్పలరాజు మెడలో ఉండాల్సిన బంగారు గొలుసు, చేతికి ఉండాల్సిన రెండు ఉంగరాలు మాయం కావడంతో వాటికోసం ఎవరైనా హత్య చేసి ఉండొచ్చా? అన్న కోణంలో విచారణ చేపట్టారు. అలాగే, వాంబేకాలనీకి చెందిన ఓ యువతితో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలుసుకున్న పోలీసులు ఆ కోణంలోనూ దర్యాప్తు ప్రారంభించారు.


More Telugu News

Vijayawada Visakhapatnam Builder Murder