ధ్రువపత్రం కోసం లంచం అడిగారట.. సీఎంకి ఫిర్యాదు చేయడానికి పాదయాత్రగా వెళుతున్న వైసీపీ వీరాభిమాని!

  • కుటుంబ సభ్యత్వ ధ్రువీకరణ పత్రం కోసం లంచం అడిగిన అధికారులు
  • సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు ఇచ్చేందుకూ తప్పించుకుంటున్న వైనం
  • ‘సీఎం సారూ.. నాకు న్యాయం చేయండి’ అంటూ పాదయాత్ర
ఓ ధ్రువీకరణ పత్రం ఇచ్చేందుకు తహసీల్దార్ కార్యాలయంలో లంచం అడిగారంటూ వైసీపీ వీరాభిమాని ఒకరు ముఖ్యమంత్రి కార్యాలయం వరకు పాదయాత్ర ప్రారంభించాడు. అక్కడి అధికారులను కలిసి పరిస్థితి వివరించాలని నిర్ణయించుకున్నాడు.

గుడివాడలోని ధనియాలపేట ఆంజనేయస్వామి గుడి వీధికి చెందిన పల్లపు శ్రీనివాసరావు వైసీపీ అభిమాని. అతడి తల్లికి గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం పసుమర్రులో మూడు సెంట్ల భూమి ఉంది. ఆమె మరణించడంతో ఆ భూమిపై తనకు స్వతహాగా రావాల్సిన హక్కు కోసం కుటుంబ సభ్యత్వ ధ్రువీకరణ పత్రం అవసరం కావడంతో తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు.

అయితే, ఆ పత్రం ఇచ్చేందుకు అధికారులు తనను లంచం అడిగారని, సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు కోరి నెలలు గడుస్తున్నా ఇవ్వకుండా తిప్పించుకుంటున్నారని శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశాడు. క్షేత్రస్థాయిలో పరిస్థితి దారుణంగా ఉందని వాపోయాడు.

ఈ క్రమంలో ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లి పరిస్థితిని వివరించేందుకు నిన్న తాడేపల్లికి పాదయాత్ర ప్రారంభించాడు. ‘అధికారుల నిర్లక్ష్యం, లంచగొండితనం.. సీఎం సారూ.. నాకు న్యాయం చేయండి’ అని ప్లకార్డు పట్టుకుని మెడలో వైసీపీ కండువా వేసుకుని పాదయాత్ర ప్రారంభించాడు.

YSRCP
Bribe
Revenue Office
Guntur District
Krishna District
Andhra Pradesh

More Telugu News