సంతానం కోసం వేశ్యల నరబలి... మధ్యప్రదేశ్ లో ఘోరం

  • గ్వాలియర్ లో ఘాతుకం
  • 18 ఏళ్ల కిందట పెళ్లి చేసుకున్న బంటు, మమత
  • పిల్లలు లేకపోవడంతో భూతవైద్యుడ్ని సంప్రదించిన వైనం
  • నరబలి ఇవ్వాలన్న భూతవైద్యుడు
  • వేశ్యలను తీసుకువచ్చిన బంటు కుటుంబ మిత్రుడు
దేశంలో మూఢనమ్మకాలు, క్షుద్ర విశ్వాసాలు ఇంకా తొలగిపోలేదని చెప్పేలా మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. సంతానం కోసం నరబలి ఇచ్చిన ఘటన సంచలనం సృష్టించింది. గ్వాలియర్ లో నివసించే బంటు, మమతా దంపతులకు 18 ఏళ్ల కిందట పెళ్లయినా, ఇప్పటికీ పిల్లలు కలగలేదు. వారి కుటుంబ స్నేహితుడు నీరజ్ పర్మార్ సలహా మేరకు ఓ భూతవైద్యుడ్ని సంప్రదించారు. ఆ భూతవైద్యుడి పేరు గిర్వార్ యాదవ్. పిల్లలు పుట్టాలంటే నరబలి ఒక్కటే మార్గమని అతడు చెప్పడంతో బంటు, మమత సరేనన్నారు.

బలి ఇచ్చేందుకు తగిన వ్యక్తిని తీసుకువచ్చే బాధ్యతను వారు నీరజ్ పర్మార్ కు అప్పగించారు. నీరజ్ ఓ వేశ్యను తీసుకురాగా, ఆమెను బలిచ్చారు. అనంతరం ఆమె మృతదేహాన్ని బైక్ పై తరలించే ప్రయత్నంలో కిందపడిపోవడంతో నీరజ్ భయపడ్డాడు. దాంతో ఆ వేశ్య మృతదేహాన్ని అక్కడే వదిలేసి పారిపోయాడు. ఆ తర్వాత మరో వేశ్యను తీసుకువచ్చి భూత వైద్యుడి సమక్షంలో బలి ఇచ్చారు. వీరు మొదట బలి ఇచ్చిన వేశ్య మృతదేహం వెలుగుచూడడంతో పోలీసులు దర్యాప్తు ఆరంభించగా, నరబలి వ్యవహారం బట్టబయలైంది.

నీరజ్ పర్మార్ ను అరెస్ట్ చేసి ప్రశ్నించగా, విషయం మొత్తం చెప్పేశాడు. దాంతో బంటు, మమతా దంపతులతో పాటు భూతవైద్యుడ్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న కాలంలోనూ ఇలాంటి ఘాతుకాలు జరగడం బాధాకరం.

Human Sacrifice
Gwalior
Children
Madhya Pradesh

More Telugu News