బ్రోకర్ సజ్జల భుజాలు ఎందుకు తడుముకుంటున్నారు?: నారా లోకేశ్

  • డ్రగ్స్ మాఫియా కింగ్ జగన్ బినామీ ద్వారంపూడిపై విచారణ జరపండి
  • జగన్ నేర సామ్రాజ్యాన్ని డ్రగ్స్ వరకు విస్తరించారు
  • మాది ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే పాలు, పెరుగు, నెయ్యి వ్యాపారం
డ్రగ్స్ బిగ్ బాస్ ఎవరని తాము ప్రశ్నిస్తే బ్రోకర్ సజ్జల రామకృష్ణారెడ్డి భుజాలు ఎందుకు తడుముకుంటున్నారని టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మా నాన్న మారిషస్, నేను దుబాయ్ అంటూ బొంబాయి కబుర్లు మానేసి... డ్రగ్స్ మాఫియా కింగ్ పిన్ జగన్ రెడ్డి బినామీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై విచారణ జరపాలని అన్నారు.

40 ఏళ్ల తన తండ్రి రాజకీయ జీవితంలో ఒక్క కేసైనా ఉందా? అని ప్రశ్నించారు. వైసీపీ రెండేళ్ల పాలనలో తనపై కక్ష కట్టి పెట్టిన ట్రాక్టర్ ర్యాష్ డైవింగ్ కేసు తప్ప... మీరు ఆరోపించిన వాటిలో ఒక్క రూపాయి అయినా అవినీతి, అక్రమాలు నిరూపించగలిగారా? అని అడిగారు.

సీబీఐ, ఈడీ, మనీలాండరింగ్, ఐటీ కేసుల్లో ఆర్థిక ఉగ్రవాది అయిన జగన్ ఇప్పుడు తన నేర సామ్రాజ్యాన్ని డ్రగ్స్ దందా వరకు విస్తరించారని లోకేశ్ ఆరోపించారు. రూ. 72 వేల కోట్ల హెరాయిన్ దిగుమతిపై డీఆర్ఐ కేసులో కూడా ఏ1 జగనేనని అన్నారు. తమది ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి వ్యాపారమని... మీది జనాల ప్రాణాలు తీసే, లక్షల కుటుంబాలకు విషాదాన్ని మిగిల్చే హెరాయిన్, గంజాయి, ప్రాణాంతక మద్యం మాఫియాలని దుయ్యబట్టారు.

'అవును నేను దుబాయ్ లో నా కుటుంబ సభ్యులతో ఉన్నా. నా పర్యటన పైనా, మీ డ్రగ్స్ బిగ్ బాస్ బినామీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సీక్రెట్ గా వెళ్లిన డ్రగ్స్ హెవెన్ ఐవరీ కోస్ట్ టూర్ పైనా కేంద్ర సంస్థల దర్యాప్తుకు సిద్ధమా, బ్రోకర్ సజ్జలా?' అంటూ లోకేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 1న ఛాలెంజ్ చేసి మరీ డ్రగ్ టెస్టులకు టీడీపీ యువనేతల బృందం వస్తే... తోకముడిచిన మీ వైసీపీ నేతలే డ్రగ్స్ మాఫియా సూత్రధారులు, వాడకందారులని తేలిపోయిందని లోకేశ్ అన్నారు. సజ్జల తీరు దొంగే.. 'దొంగా దొంగా' అని అరిచినట్టుందని ఎద్దేవా చేశారు.


More Telugu News

Nara Lokesh Chandrababu Telugudesam Jagan Sajjala Ramakrishna Reddy Dwarampudi Chandrasekhar Reddy Drugs