న్యాయవ్యవస్థలో 50 శాతం రిజర్వేషన్లు కావాలని మహిళలు అడగాలి: సీజేఐ ఎన్వీ రమణ

  • మహిళా న్యాయవాదుల ఆధ్వర్యంలో సుప్రీం జడ్జిలకు సత్కారం
  • హాజరైన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్
  • మహిళా న్యాయవాదుల ఇబ్బందుల ప్రస్తావన
  • మహిళల న్యాయపరమైన డిమాండ్లకు మద్దతు
మహిళా న్యాయవాదుల ఆధ్వర్యంలో నేడు సుప్రీంకోర్టు జడ్జిలకు సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోర్టుల్లో మహిళా న్యాయవాదులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. న్యాయస్థానాల్లో మహిళా న్యాయవాదులకు మౌలిక వసతులు కల్పించాలని తెలిపారు. దేశంలోని 22 శాతం కోర్టుల్లో మరుగుదొడ్లు లేవని పేర్కొన్నారు.

న్యాయవ్యవస్థలో 50 శాతం రిజర్వేషన్లు కావాలని మహిళలు అడగాలని సూచించారు. లా కాలేజీల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని పేర్కొన్నారు. మహిళల న్యాయపరమైన డిమాండ్లకు తాను మద్దతిస్తానని జస్టిస్ ఎన్వీ రమణ ఉద్ఘాటించారు. సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తులు 11 శాతం మాత్రమే ఉన్నారని వెల్లడించారు. అటు హైకోర్టుల్లోనూ మహిళా జడ్జిలు 11.5 శాతం మాత్రమే ఉన్నారని వివరించారు. దేశంలోని మొత్తం 17 లక్షల మంది న్యాయవాదుల్లో 15 శాతం మాత్రమే మహిళలు ఉన్నారని తెలిపారు. రాష్ట్రాల బార్ కౌన్సిళ్లలో 2 శాతం మంది మాత్రమే మహిళలు ఉన్నారని వెల్లడించారు.

విజయదశమి తర్వాత కోర్టుల్లో ప్రత్యక్ష విచారణ ప్రారంభిస్తామని జస్టిస్ ఎన్వీ రమణ వెల్లడించారు. ప్రత్యక్ష విచారణతో న్యాయమూర్తులకు ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. అయితే, ప్రత్యక్ష విచారణతో న్యాయవాదులు, ఇతర సిబ్బందికే ఇబ్బందులు ఉన్నాయని అభిప్రాయపడ్డారు.

NV Ramana
Women Advocates
Reservations
Supreme Court
India

More Telugu News