తాలిబన్లలో విభేదాలు.. బరాదర్ అలక!

  • కేబినెట్‌లో హక్కానీ నెట్‌వర్క్ ఉగ్రవాదులు
  • కూర్పు నచ్చక అధికారిక కార్యక్రమాలకు బరాదర్ దూరం
  • అధ్యక్ష భవనంలో జరిగిన ఘర్షణలో బరాదర్ మృతి చెందినట్టు కూడా వార్తలు
  • టీవీ ముందుకొచ్చి ఖండించిన బరాదర్
ఆఫ్ఘనిస్థాన్‌ను ఆక్రమించుకుని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూడా ప్రకటించిన తాలిబన్లు ఇప్పుడు అంతర్గత కుమ్ములాటలతో సతమతం అవుతున్నారు. నిజానికి తాత్కాలిక కేబినెట్ ఏర్పాటు చేయడమే వీరి మధ్య విభేదాలకు కారణమని తెలుస్తోంది. కేబినెట్‌లో హక్కానీ నెట్‌వర్క్ వంటి సంస్థలకు చెందిన ఉగ్రవాదులే ఉన్నారు.

అయితే, ఈ కూర్పును తాలిబన్లలోని ఆచరణవాదులు, సిద్ధాంతకర్తలు మెచ్చడం లేదని, దీంతో వారి మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొందని చెబుతున్నారు. అంతేకాదు, అధ్యక్ష భవనంలో ఇరు వర్గాల మధ్య పెద్ద గొడవ కూడా జరిగినట్టు సమాచారం. ఈ ఘర్షణలో ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ మృత్యువాత పడ్డారని కూడా ఇటీవల వార్తలు రాగా, అదంతా అబద్ధమని, తాను బతికే ఉన్నానని బరాదర్ బుధవారం టీవీలో కనిపించి స్పష్టం చేశారు.

తన ఆకాంక్షలకు విరుద్ధంగా కేబినెట్‌ కూర్పు ఉండడం వల్లే ఉప ప్రధాని అయినప్పటికీ అధికారిక కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు. ఖతర్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుర్ రహమాన్ అలీ థనీ ఆఫ్ఘనిస్థాన్ పర్యటనకు వచ్చినప్పుడు ఆయనకు స్వాగతం పలికేందుకు బరాదర్ రాకపోవడం కూడా విభేదాల వార్తలను మరింత బలపరుస్తోంది.

Mullah Abdul Ghani Baradar
Afghanistan
Cabinet

More Telugu News