ఆఫ్ఘన్ గడ్డ ఉగ్రవాదులకు అడ్డా కాకూడదు: భారత్, ఆస్ట్రేలియా ఉద్ఘాటన

India and Australia discuss on Aghanistan
  • భారత్, ఆస్ట్రేలియా 2 ప్లస్ 2 చర్చలు
  • చర్చల్లో పాల్గొన్న రక్షణ, విదేశాంగ మంత్రులు
  • ఆఫ్ఘన్ అంశాలపై చర్చ
  • ఆఫ్ఘన్ పౌరుల పరిస్థితి పట్ల ఆందోళన
భారత్, ఆస్ట్రేలియా దేశాల రక్షణ, విదేశాంగ మంత్రులు నేడు సమావేశమయ్యారు. 2 ప్లస్ 2 విధానంలో జరిగిన ఈ భేటీలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పీటర్ డట్టన్, ఆస్ట్రేలియా రక్షణ శాఖ మంత్రి మేరీస్ పేన్ పాల్గొన్నారు. చర్చలు ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. కాగా, తాలిబన్ల ఏలుబడిలో ఆఫ్ఘనిస్థాన్ భూభాగం ఉగ్రవాదులకు స్వర్గధామం కారాదని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఇతర దేశాలపై దాడుల కోసం ఆఫ్ఘన్ గడ్డపై నుంచి కార్యకలాపాలు ఎంతమాత్రం తగవని స్పష్టం చేశారు.

ఆఫ్ఘన్ లో ఏర్పడే ప్రభుత్వంలో అన్ని వర్గాలకు స్థానం కల్పించాల్సిన అవసరం ఉందని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని భారత్, ఆస్ట్రేలియా ఉద్ఘాటించాయి. కల్లోలభరిత పరిస్థితుల నడుమ చితికిపోయిన ఆఫ్ఘనిస్థాన్ ను వీడేందుకు అక్కడి పౌరులకు అవకాశం కల్పించాలని సూచించాయి.

అటు, పాకిస్థాన్ జాతీయ భద్రతా సలహాదారు మొయీద్ యూసుఫ్ తమకు మాత్రమే సాధ్యమైన రీతిలో వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ దేశాలు తాలిబన్లను గుర్తించాలని, వారితో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకోవాలని పిలుపునిచ్చారు. లేకపోతే శరణార్థి సంక్షోభం తలెత్తుతుందని హెచ్చరించారు. తాలిబన్లను పరిగణనలోకి తీసుకోకపోతే అందుకు తగ్గ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. తాలిబన్లను బహిష్కరించాలనుకోవడం పెద్ద తప్పిదం అవుతుందని పేర్కొన్నారు. దీనిపై అంతర్జాతీయ సమాజం తప్పకుండా ఆలోచించాలని మొయీద్ యూసుఫ్ అన్నారు.
Go Back to Shorts
India
Australia
Afghanistan
Discussions

More Telugu News