తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇంటర్వ్యూకు వెళుతున్న ఐదుగురు స్నేహితుల దుర్మరణం

  • బాధితులందరూ 25-30 ఏళ్లలోపు వారే
  • అందరూ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లే
  • ప్రమాదం ధాటికి నుజ్జునుజ్జయిన కారు
చెన్నై సమీపంలోని పెరుంగళత్తూర్‌లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు స్నేహితులు అక్కడికక్కడే మరణించారు. హిందూస్థాన్ యూనివర్సిటీ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు అయిన వీరందరూ కలిసి నేడు చెన్నైలో జరగనున్న ఇంటర్వ్యూ కోసం శనివారం కారులో బయలుదేరారు. అర్ధరాత్రి దాటిన తరువాత 1.30- 2 గంటల మధ్య చెంగల్పట్టు జిల్లా పెరుంగళత్తూర్ సమీపంలో ఆగి ఉన్న లారీని వీరి కారు ఢీకొట్టింది. దీంతో కారు ధ్వంసం కాగా, అందులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మరణించారు.

సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నుజ్జునుజ్జయిన కారులో ఇరుక్కుపోయిన వారి మృతదేహాలను అతి కష్టంపై బయటకు తీశారు. వీరంతా 25-30 ఏళ్ల లోపు వారేనని పేర్కొన్న పోలీసులు వారిని.. రాహుల్ కార్తికేయన్ (పుదుక్కోట), రాజాహరీష్ (మేట్టూరు), అరవింద్ శంకర్ (చెన్నై కేకే నగర్), అజయ్ (తిరుచ్చి), నవీన్ (మేట్టూర్)గా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tamil Nadu
Road Accident
Car
Lorry
Students
Perungalathur

More Telugu News