చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా... టోక్యో ఒలింపిక్స్ లో భారత బల్లేనికి బంగారం చిక్కింది!

యావత్ భారతావని మురిసేలా భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. వందేళ్ల ఒలింపిక్స్ చరిత్రలో భారత్ కు అథ్లెటిక్స్ లో తొలి స్వర్ణం అందించాడు. ఒలింపిక్స్ లో భారత్ కు ఇప్పటివరకు ఇతర క్రీడాంశాల్లో స్వర్ణం అందినా, అథ్లెటిక్స్ స్వర్ణం అందని ద్రాక్షలా ఊరిస్తూనే ఉంది. ఇప్పుడు నీరజ్ చోప్రా అద్భుత ప్రదర్శనతో భారత క్రీడారంగానికి ఆ లోటు కూడా తీరిపోయింది.

టోక్యో ఒలింపిక్స్ లో పసిడి కాంతులు విరజిమ్మిన చోప్రా... ఇవాళ జరిగిన జావెలిన్ త్రో ఫైనల్స్ లో తిరుగులేని బలంతో ప్రత్యర్థులను వెనక్కి నెట్టి ప్రథమస్థానం కైవసం చేసుకున్నాడు. జావెలిన్ ను 87.58 మీటర్లు విసిరి గోల్డ్ మెడల్ చేజిక్కించుకున్నాడు. ఈ పతకంతో భారత్ కు టోక్యో ఒలింపిక్స్ లో మొత్తం 7 పతకాలు లభించినట్టయింది. ఒక స్వర్ణం, రెండు రజతాలు, 4 కాంస్యాలు భారత్ ఖాతాలో చేరాయి.

Neeraj Chopra
Gold
Javelin Throw
Tokyo Olympics
India

More Telugu News