Athletes: ఒలింపిక్ గ్రామంలో మరో ఇద్దరికి కరోనా... ప్రారంభోత్సవం ముంగిట మహమ్మారి కలకలం

 Two more athletes tested corona positive in Tokyo Olympic village
  • ఈ నెల 23 నుంచి టోక్యో ఒలింపిక్స్
  • ఇటీవల కీడ్రాగ్రామంలో ఒకరికి కరోనా
  • అదే దేశానికి చెందిన మరో ఇద్దరికీ పాజిటివ్
  • మూడుకు పెరిగిన కరోనా కేసులు
  • ఒలింపిక్స్ పై ముసురుకుంటున్న సందేహాలు!
ఈ నెల 23న జపాన్ రాజధాని టోక్యోలో ఒలింపిక్ క్రీడలు ప్రారంభం కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో, క్రీడాకారులు బస చేసే ఒలింపిక్ గ్రామంలో మరో ఇద్దరు అథ్లెట్లకు కరోనా పాజిటివ్ అని తేలింది. కొన్ని రోజుల కిందటే ఓ అథ్లెట్ కరోనా బారినపడడం తెలిసిందే. దాంతో ఒలింపిక్ విలేజ్ లో కరోనాతో బాధపడుతున్న అథ్లెట్ల సంఖ్య మూడుకు చేరింది. ఈ ముగ్గురు ఒకే దేశానికి చెందిన వారని, అది కూడా వీరంతా ఒకే క్రీడాంశంలో పాల్గొనే అథ్లెట్లు అని టోక్యో ఒలింపిక్స్ అధికార ప్రతినిధి మాసా టకాయా తెలిపారు. వారిని వారి గదుల్లోనే ఐసోలేషన్ లో ఉంచామని, ఒలింపిక్స్ నిర్వాహకులే వారికి భోజన ఏర్పాట్లు చేస్తున్నారని వెల్లడించారు.

ప్రపంచ దేశాల నుంచి టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొనేందుకు వచ్చే అథ్లెట్ల కోసం ప్రత్యేకంగా ఓ టౌన్ షిప్ వంటి గృహసముదాయంలో బస ఏర్పాటు చేశారు. ఇందులో భారీ అపార్ట్ మెంట్ తరహా భవనాలు ఉంటాయి. వీటిలో 6,700 మంది అథ్లెట్లు బస చేస్తారని అంచనా. ఇన్ని వేలమంది ఉండే ఈ ఒలింపిక్ గ్రామంలో కరోనా కలకలం రేగడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. మరో ఐదు రోజుల్లో ఒలింపిక్ క్రీడల ప్రారంభోత్సవం జరగాల్సి ఉండగా, ఒలింపిక్ గ్రామంలో ఇంకెన్ని పాజిటివ్ కేసులు బయటపడతాయోనని భయపడుతున్నారు.

గతేడాది జరగాల్సిన ఒలింపిక్ క్రీడలు కరోనా వ్యాప్తి కారణంగా ఈ ఏడాదికి వాయిదాపడ్డాయి. ఓవైపు జపాన్ లో కొత్త వేరియంట్లు వెలుగుచూస్తున్నప్పటికీ ఒలింపిక్స్ జరపాలని అక్కడి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. అందుకే ప్రేక్షకులను అనుమతించకుండా క్రీడోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. కానీ అథ్లెట్లలోనే కరోనా కేసులు రావడంతో ఒలింపిక్స్ క్రీడలపై సందేహాలు ముసురుకుంటున్నాయి.
Athletes
Corona Virus
Positive
Olympic Village
Tokyo Olympics
Jagan

More Telugu News