ఏపీ ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుదోవ పట్టిస్తోంది: కేఆర్ఎంబీకి తెలంగాణ లేఖ

Telangana govt wrote KRMB Chairman
  • శ్రీశైలం నుంచి తెలంగాణ విద్యుదుత్పత్తి
  • కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేసిన ఏపీ
  • ఉత్పత్తి ఆపాలంటూ తెలంగాణకు కేఆర్ఎంబీ లేఖ
  • ప్రతిగా కేఆర్ఎంబీకి లేఖ రాసిన తెలంగాణ ప్రభుత్వం
ఏపీ, తెలంగాణ మధ్య రేగిన జలవివాదాలు ఇప్పట్లో సద్దుమణిగేలా లేవు. శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని ఏపీ ప్రభుత్వం కేఆర్ఎంబీకి లేఖ రాయగా, విద్యుత్ ఉత్పత్తి ఆపాలంటూ కేఆర్ఎంబీ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనిపై తెలంగాణ నీటి పారుదల శాఖ ఎస్ఈసీ స్పందించారు. కేఆర్ఎంబీ బోర్డు చైర్మన్ కు తెలంగాణ ప్రభుత్వం తరఫున లేఖ రాశారు.

వాస్తవాలు పరిగణనలోకి తీసుకుని అభిప్రాయానికి రావాలని తెలంగాణ నీటి పారుదల శాఖ ఎస్ఈసీ సూచించారు. ఏపీ ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుదోవ పట్టిస్తోందని తెలిపారు. పదేళ్లుగా ఏప్రిల్, మే మాసాల్లో 834 అడుగుల నీటి మట్టాన్ని ఉంచలేదని తెలిపారు. బేసిన్ వెలుపల నీటి తరలింపునకు ఏపీ 854 అడుగులు ఉండాలంటోందని ఆరోపించారు.

కృష్ణా డెల్టా కోసం 760 అడుగుల వరకు నీరు వదిలేలా 2013లో మెమో ఇచ్చారని ఎస్ఈసీ... కేఆర్ఎంబీ చైర్మన్ కు వివరించారు. ఏపీ రెండేళ్లుగా వరుసగా 170 టీఎంసీలు, 124 టీఎంసీలు తరలించిందని వెల్లడించారు. చెన్నై తాగునీటి కోసం ఏపీ 10 టీఎంసీలు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. పెన్నా సహా ఇతర బేసిన్లలో 360 టీఎంసీల నీరు ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో, తెలంగాణ విద్యుత్పాదన వల్ల ఏపీకి నష్టం జరుగుతుందన్న వాదన నిరాధారం అని ఎస్ఈసీ స్పష్టం చేశారు.

50 శాతం నిష్పత్తిలో విద్యుత్ పంచాలని విభజన చట్టంలో లేదని తెలంగాణ నీటిపారుదల శాఖ ఎస్ఈసీ పేర్కొన్నారు. ముందు చేసుకున్న అవగాహన ఈ ఏడాదికే వర్తిస్తుందని తేల్చి చెప్పారు. కృష్ణా ట్రైబ్యునల్ తీర్పునకు లోబడి, ప్రణాళిక సంఘం నివేదిక అనుసరించే శ్రీశైలంలో విద్యుదుత్పత్తి చేస్తున్నట్టు వెల్లడించారు. శ్రీశైలంలో క్యారీ ఓవర్ స్టోరేజి ఉండేలా విద్యుదుత్పత్తి చేస్తున్నామని తెలిపారు. తమ వాటా నీటిని విచక్షణ, అవసరాల మేరకు వాడుకుంటున్నామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో శ్రీశైలంలో విద్యుదుత్పాదనపై ఏపీ అభ్యంతరాలు అసంబద్ధం అని వివరించారు.
Go Back to Shorts
Telangana
SEC
KRMB
Chairman
Srisailam Project
Andhra Pradesh

More Telugu News