'ఏపీ రాజధాని' వివాదంపై క్షమాపణలు చెప్పిన యాంకర్ ప్రదీప్

  • వివాదాస్పదమైన యాంకర్ ప్రదీప్ వ్యాఖ్యలు
  • ఏపీ రాజధాని విశాఖ అంటూ టీవీ షోలో వెల్లడి
  • ఏపీ పరిరక్షణ సమితి ఆగ్రహం
  • వీడియో సందేశం వెలువరించిన ప్రదీప్
ఓ టీవీ కార్యక్రమంలో ఏపీ రాజధాని విశాఖ అంటూ పేర్కొనడం పట్ల యాంకర్ ప్రదీప్ పై ఏపీ పరిరక్షణ సమితి ఆగ్రహం వ్యక్తం చేస్తుండడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, యాంకర్ ప్రదీప్ స్పందించారు. తన సందేశంతో కూడిన ఓ వీడియో విడుదల చేశారు. తన వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే మనస్ఫూర్తిగా క్షమించాలని కోరారు. తాను ఉద్దేశపూర్వకంగా ఎవరినీ నొప్పించలేదని, ఎవరినీ కించపర్చాలని ఈ విధంగా చేయలేదని స్పష్టం చేశారు.

రాష్ట్రం, రాజధాని... అనే అంశంపై టీవీ షోలో ప్రశ్నలు అడుగుతుండగా ఆ అంశం తప్పుదారి పట్టిందని పేర్కొన్నారు. వాస్తవానికి ఇలాంటి అంశాలకు తాను దూరంగా ఉంటానని, ప్రేక్షకులకు వినోదం అందించడమే తన ప్రాధాన్యత అని ప్రదీప్ వెల్లడించారు. అందుకు మీ ఆశీస్సులు కావాలి అంటూ తన సందేశాన్ని ముగించారు.

Anchor Pradeep
Apology
TV Show
AP Capital
Visakha

More Telugu News