సీఏఏ వ్యతిరేక అల్లర్లపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

  • నిరసన హక్కు, తీవ్రవాద కార్యకలాపాలకు తేడా ఉంది
  • ఆ గీతను ప్రభుత్వం చెరిపేసిందని అసహనం
  • ఇదే కొనసాగితే ప్రజాస్వామ్యానికి దుర్దినమన్న కోర్టు
  • ముగ్గురు కార్యకర్తలకు షరతులతో కూడిన బెయిల్
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వ్యతిరేక ఆందోళనల సందర్భంగా ఢిల్లీలో జరిగిన అల్లర్లకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ కేసులో ఏడాది క్రితం అరెస్టయిన ముగ్గురు కార్యకర్తలకు బెయిల్ మంజూరు చేసింది. మహిళా హక్కుల సంఘం పింజ్రా టాడ్ సభ్యులైన నటాషా నర్వాల్, దేవాంగన కలీతాలతో పాటు జామియా ఇస్లామియా విద్యార్థి ఆసిఫ్ ఇక్బాల్ కు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది.

చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం కింద అరెస్టయిన వారికి ఇంతకుముందు ట్రయల్ కోర్టు బెయిల్ ను నిరాకరించింది. తాజాగా వారికి రూ.50 వేల వ్యక్తిగత పూచీకత్తుతో ఢిల్లీ హైకోర్టు బెయిల్ ను ఇచ్చింది. పాస్ పోర్టులను అధికారులకు సరెండర్ చేయాలని, విచారణకు అడ్డంకులు సృష్టించకూడదని వారిని ఆదేశించింది.

ఇటు ఆ కేసుల విషయంలో కేంద్ర ప్రభుత్వానికీ చురకలు అంటించింది. ‘‘అసమ్మతిని అణచి వేయాలన్న ఉద్దేశంతో రాజ్యాంగం ప్రసాదించిన నిరసన హక్కుకు, తీవ్రవాద కార్యకలాపాలకు మధ్య ఉన్న సన్నని గీతను ప్రభుత్వం చెరిపేసినట్టుంది. భవిష్యత్ లో ఇదే కొనసాగితే అది ప్రజాస్వామ్యానికి దుర్దినం అవుతుంది’’ అని వ్యాఖ్యానించింది.


More Telugu News

CAA NRC New Delhi High Court