పీకేతో శరద్ పవార్ భేటీపై ఊహాగానాలకు తెరదించిన ‘మహా’ మంత్రి నవాబ్ మాలిక్

  • పీకేను ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకోలేదు
  • ప్రతిపక్షాలను ఏం చేయాలన్నదే పవార్ సాబ్ లక్ష్యం
  • డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌దీ ఇదే మాట
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ భేటీ తర్వాత ‘మహా’ రాజకీయాల్లో జరుగుతున్న చర్చపై  ఎన్సీపీ నేత, మంత్రి నవాబ్ మాలిక్ స్పష్టత ఇచ్చారు. పీకేను ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకోలేదని స్పష్టం చేశారు. అయితే, ప్రశాంత్ కిశోర్‌పై మాత్రం మాలిక్ ప్రశంసలు కురిపించారు. ఆయన గొప్ప వ్యూహకర్త అని కొనియాడారు. శరద్ పవార్‌, పీకే మధ్య భేటీలో ప్రతిపక్షాలను ఏకం చేయడంపైనే చర్చ జరిగిందని అన్నారు.

‘‘ప్రశాంత్ కిశోర్‌ను ఎన్సీపీ ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకోలేదు. ప్రతిపక్షాలను ఏకం చేయాలని పవార్ సాబ్ కోరుకుంటున్నారు. ఈ ప్రయత్నాలు మున్ముందు కూడా కొనసాగుతాయి’’ అని మాలిక్ చెప్పుకొచ్చారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన వ్యూహకర్తగా పనిచేసిన డీఎంకే, టీఎంసీ విజయం సాధించిన తర్వాత.. ఇకపై ఏ పార్టీకీ తాను ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయబోనని పీకే స్పష్టం చేశారు. అయితే, ఇన్నాళ్లకు మళ్లీ శరద్ పవార్‌ను కలవడం రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది.

కాగా, పీకేను ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకున్నట్టు వచ్చిన వార్తలను శరద్ పవార్ మేనల్లుడు, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కూడా కొట్టిపడేశారు. శరద్ పవార్ నివాసంలో జరిగిన ఈ భేటీ తర్వాత అటు శరద్ పవార్ కానీ, ఇటు పీకే కానీ ఇప్పటి వరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం.


More Telugu News

Prashant Kishor Sharad Pawar NCP Ajit Pawar