సంగం డెయిరీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయాలని ధూళిపాళ్లను చంద్రబాబు కోరింది నిజం కాదా?: పేర్ని నాని

  • అరాచకాలకు పాల్పడుతున్న జనార్దన్ రెడ్డిపై కేసులు పెట్టకూడదా?
  • సహకార డెయిరీ వ్యవస్థను చంద్రబాబు నాశనం చేశారు
  • టీడీపీ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు
అరాచకాలకు పాల్పడుతున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డిపై కేసులు పెట్టకూడదా? అని ఏపీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. వైసీపీకి చెందిన దళిత కార్యకర్తపై జనార్ధన్ రెడ్డి హత్యాయత్నం చేశారని చెప్పారు. అరాచకాలకు పాల్పడిన వ్యక్తిని చంద్రబాబు వెనకేసుకురావడం కరెక్టేనా? అని ప్రశ్నించారు. చంద్రబాబుకు సిగ్గు, ఎగ్గు లేదని అన్నారు. ఇప్పుడున్నది చంద్రబాబు పాలన కాదని... జగన్ పాలన అని చెప్పారు.

సంగం డెయిరీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయాలని ధూళిపాళ్ల నరేంద్రను గతంలో చంద్రబాబు కోరింది నిజం కాదా? అని ప్రశ్నించారు. ఛైర్మన్ పదవికి రాజీనామా చేస్తే మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు అన్నారని చెప్పారు. ఏపీలో సహకార డెయిరీ వ్యవస్థను చంద్రబాబు సర్వనాశనం చేశారని ఆరోపించారు.

లక్ష జీవాలను చంపిన మొసలి ముసలితనంలో నీతులు చెప్పినట్టు చంద్రబాబు తీరు ఉందని విమర్శించారు. ఎంపీ రఘురామకృష్ణరాజుకు, చంద్రబాబుకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. ప్రతి కేసును రఘురాజు కేసు మాదిరే ముగిద్దామని టీడీపీ కార్యకర్తలకు చంద్రబాబు సిగ్గులేకుండా చెపుతున్నారని మండిపడ్డారు. టీడీపీ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం లేదని అన్నారు.


More Telugu News

Perni Nani YSRCP Chandrababu Telugudesam BC Janardhan Reddy